హైదరాబాద్కు మణిహారంలా మారిన ఔటర్ రింగు రోడ్డు చుట్టూరా మినీ పట్టణాల అభివృద్ధికి (రవాణా ఆధారిత అభివృద్ధి కేంద్రాల) అనుకూలమైన వాతావరణం ఏర్పడుతున్నది. పనిచేసే చోటే నివాసం ఉండేలా అందుకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రేటర్పై అన్ని విధాలుగా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలోనే సమాంతరంగా అభివృద్ధి కేంద్రాల నిర్మాణం అత్యవసరమని ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగానే నగరంతో సంబంధం లేకుండా ట్రాన్సిట్ ఓరియంటెడ్ గ్రోత్ సెంటర్లు (టీవోజీసీ/రవాణా అధారిత ప్రాంతాల అభివృద్ధి)గా పిలిచే వీటి నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
శివారు ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధ్దమైన పట్టణీకరణే లక్ష్యంగా పనిచేస్తున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఓఆర్ఆర్ చుట్టూ 13 చోట్ల మినీ పట్టణాలను ప్రతిపాదనలు రూపొందించింది.
దీనిపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు చేస్తున్నది. అవసరమైన భూముల సేకరణ, ఆయా ప్రాంతాల్లో మెరుగైన మౌలికవసతులను కల్పించడం ద్వారా ఆ ప్రాంతంలో నివాస ప్రాంతాలు పెరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. టీవోజీసీలకు అనువైన స్థలం కోసం ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న రంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లతోనూ పలుమారు సంప్రదించారు. శివారు ప్రాంతాల్లో జాతీయ, రాష్ట్ర రహదారులపై టీవోజీసీలను అందుబాటులోకి తేవడం వల్ల శరవేగంగా అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని అధికారులు ఆ దిశగా మౌలిక వసతులను కల్పిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు వస్తున్న కంపెనీలు సైతం ఔటర్ చుట్టూనే తమ కంపెనీలను నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న అనధికారిక లే అవుట్ల క్రమబద్ధీకరణ కింద వసూలయ్యే నగదు మొత్తంలో మూడోవంతుగా ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఎల్ఆర్ఎస్ రూపంలో వచ్చిన నిధుల్లో సుమారు రూ.210 కోట్లను 36 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు మంజూరు చేశారు. ఈ నిధులతో బీటీ రోడ్లు, పబ్లిక్ టాయిలెట్లు, ఖాళీ స్థలాల్లో పార్కుల అభివృద్ధి, వైకుంఠధామాలు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, వీధి లైట్లు వంటి మౌలిక వసతులు కల్పించడం ద్వారా ప్రజలు అక్కడ నివాసం ఉండేందుకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తున్నారు. ముఖ్యంగా కోర్ సిటీ నుంచి ఔటర్ మీదుగా వెళ్లే జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల వెంట ప్రాంతాలను మినీ పట్టణాలను ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యతనిస్తున్నారు.
158 కిలోమీటర్లు ఉన్న ఔటర్ రింగు రోడ్డు చుట్టూ మొత్తం 19 ఇంటర్ ఛేంజ్లు ఉండగా, అందులో 13 చోట్ల అన్ని వర్గాలకు అనువైన ప్రాంతాలను మినీ పట్టణాలుగా ఏర్పాటు చేయవచ్చని గుర్తించారు. దానిలో భాగంగానే ఆదిబట్ల, బొంగుళూరు, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, కీసర, కోకాపేట, మేడ్చల్, పటాన్చెరు, పెద్ద అంబర్పేట, శామీర్పేట, తెల్లాపూర్, తుక్కుగూడ, తిమ్మాపూర్ల వద్ద ఈ రవాణా ఆధారిత అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. నగరంపై ఒత్తిడి తగ్గడంతో పాటు స్థానికంగా ఉండే వారికి స్వయం ఉపాధి, భవిష్యత్లో పెరిగే జనాభా దృష్ట్యా ఉద్యోగం, నివాసాలకు దోహదపడనుంది.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నుంచి కొత్తగా వస్తున్న పరిశ్రమలన్నీ ఔటర్ చుట్టూనే ఏర్పాటవుతున్నాయి. ఐటీతో పాటు ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, లాజిస్టిక్, ఇతర రంగాలకు చెందిన కంపెనీలు 90 శాతం ఔటర్ చుట్టూనే ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. దీంతో హెచ్ఎండీఏ ఆయా ప్రాంతాల్లో అత్యంత మెరుగైన వసతులను కల్పిస్తూ ఉండడంతో అక్కడే నివాస ప్రాంతాలు ఏర్పాటు చేసుకొని స్థిర నివాసం ఉండేలా చేస్తున్నారు. దీనివల్ల ప్రతి రోజూ ఉద్యోగులు నగరానికి వచ్చి వెళ్లకుండా అక్కడే నివాసం ఉండడంతో నగరంపై కూడా ట్రాఫిక్ వత్తిడి తగ్గనున్నది.