మరిపెడ, జూలై 13: నల్లబెల్లం రవాణా చేస్తున్న వ్యాపారులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తొర్రూరు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. మంగళవారం సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మరిపెడ ఎస్సై పోలిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, కురవి మండలంలోని సీరోలు ఎస్సై ఎస్ శ్రీనివాస్ వేర్వేరుగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో డీసీఎం, అశోక్ లేలాండ్ వాహనాల్లో రూ.7.3 లక్షల విలువైన 85 క్వింటాళ్ల నల్లబెల్లం, 4 క్వింటాళ్ల పటికను స్వాధీనం చేసుకుని ఏడుగురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. కురవి మండలం సీరోలు పోలీస్స్టేసన్ పరిధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పీతల రత్నరాజు, మేడిది రాజేశ్, కురవి మండలానికి చెందిన పెడూరి మల్లేశం, గుగులోత్ అశోక్, మరిపెడ పోలీస్స్టేషన్ పరిధిలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రాసంశెట్టి వెంకటసుబ్బారావు, సూర్యాపేట జిల్లాకు చెందిన వాంకుడోత్ ఉపేందర్, శనిగపురానికి చెందిన బానోత్ కృష్ణ, సూర్యాపేట జిల్లాకు చెందిన వాంకుడోత్ ఉపేందర్పై కేసు నమోదు చేశామని, మరో నిందితుడు వాంకుడోత్ మురళి పరారీలో ఉన్నట్లు తెలిపారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన ఎస్సైలు శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్, భిక్షపతి, కాంత్రికుమార్, విద్యాసాగర్, రంజిత్ను సీఐ సాగర్, డీఎస్పీ అభినందించారు.