హైదరాబాద్ : హయత్నగర్లో గత వారం చోటు చేసుకున్న హత్య కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనే భర్తను భార్య తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఎల్బీనగర్ జోన్ డీసీపీ సన్ప్రీత్ సింగ్ ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.
కర్ణాటకకు చెందిన ఫీర్దోస్ బేగం(35), మహమ్మద్ ముస్తాక్ పటేల్(46)కు కొన్నేండ్ల క్రితం వివాహమైంది. వీరు నగరంలోని సైదాబాద్లో ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ముస్తాక్ పటేల్ ట్రక్కు డ్రైవర్ కాగా, ఫీర్దోస్ బేగం ఇంటి వద్దే ఉంటుంది. ఈ క్రమంలో కర్ణాటకకు చెందిన హమీద్ పటేల్, ఫీర్దోస్ బేగంకు పరిచయం అయ్యాడు. దీంతో వీరిద్దరూ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఈ విషయం ముస్తాక్ పటేల్కు తెలియడంతో.. భార్యను పలుమార్లు హెచ్చరించాడు. అయినా భార్య ప్రవర్తనలో మార్పురాలేదు.
తన వివాహేతర సంబంధానికి అడ్డుపడుతున్న భర్తను అంతమొందించాలని ఫీర్దోస్ నిర్ణయించుకుంది. దీంతో ప్రియుడు హమీద్ పటేల్తో కలిసి ప్లాన్ చేసింది. అక్టోబర్ 22న ముస్తాక్ పటేల్ పీకల దాకా మద్యం సేవించాడు. ఇదే అదునుగా భావించిన ఫీర్దోస్, ఆమె ప్రియుడు కలిసి ముస్తాక్ను కారులో బాటసింగారం వైపు తీసుకెళ్లారు. మద్యం మత్తులో ఉన్న అతని కాళ్లు, చేతులు కట్టేసి పదునైన ఆయుధంతో గొంతుకోసి చంపారు. ఆ తర్వాత కారులో డెడ్బాడీని తీసుకొచ్చి హయత్నగర్లో వదిలి పరారీ అయ్యారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఫీర్దోస్ బేగం, హమీద్ పటేల్తో పాటు సయ్యద్ నాయబ్ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి మారుతి కారు, ఒక మొబైల్ ఫోన్, ఐరన్ రాడ్, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.