న్యూఢిల్లీ, మే 7: డెంగీ, మలేరియాను అరికట్టడానికి బిల్గేట్స్ నిధులు సమకూర్చిన ఆక్సిటెక్ బయోటెక్ కంపెనీ ఆసక్తికరమైన ప్రయోగాన్ని చేసింది. దోమలను దోమలతోనే చంపేవిధంగా ఏడిస్ ఈజిప్టి మగ దోమల్లో జన్యుపరమైన మార్పులు చేసింది. అలా జన్యుమార్పులు చేసిన 1,50,000 దోమలను అమెరికాలో వదిలిపెట్టింది. యూకేకు చెందిన ఈ కంపెనీ ఈ ప్రయోగాన్ని ఇప్పటికే బ్రెజిల్, మలేషియా, పనామాలో నిర్వహించింది. తాజాగా అమెరికా ఈ ప్రయోగానికి ఆమోదం తెలుపడంతో ప్రయోగాత్మకంగా ఫ్లోరిడాలో జన్యుమార్పిడి చేసిన దోమలను వదిలింది. సాధారణంగా ఆడ ఏడిస్ ఈజిప్టి దోమలు మలేరియా లాంటి వ్యాధులకు కారణం అవుతాయి. జన్యుమార్పులు చేసిన మగ దోమలు ఆడ దోమలతో కలిసినప్పుడు… కొత్తగా పుట్టే ఆడదోమలు లార్వా దశలో చనిపోయే విధంగా జన్యువులను రూపొందించారు. మగ దోమలకు మాత్రం యథావిధిగా జన్యువులు సంక్రమణం చెందుతాయి. అంటే వ్యాధులను కలిగించే ఆడదోమలు పుట్టుకలోనే చనిపోతాయన్న మాట. మగదోమల్లో కొత్తరకమైన కృత్రిమ జన్యువులు ఉండటం వల్ల క్రమంగా ఆడ దోమల సంఖ్య తగ్గి వ్యాధులు అదుపులోకి వస్తాయి. అమెరికాలో ఈ దోమల ప్రయోగంలో భాగంగా రెండో దశలో 2 కోట్ల దోమలను విడుదల చేయనున్నారు.