కాఠ్మండు: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మమమ్మారి ఎవరెస్ట్కు ఎగబాకింది. ప్రపంచంలోనే ఎత్తైన పర్వత్వాన్ని కూడా వైరస్ చేరుకున్నది. నేపాల్లోని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తున్న నార్వే దేశానికి చెందిన ఎర్లెండ్ నెస్కు కరోనా పాజిటివ్గా గురువారం నిర్ధారణ అయింది. దీంతో పర్వతంపైనున్న బేస్ క్యాంపు నుంచి అతడితోపాటు ఒక షెర్పాను హెలికాప్టర్లో కాఠ్మండులోని ఆసుసత్రికి తరలించారు. పరీక్షలో తమ ఇద్దరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఎర్లెండ్ నెస్ తెలిపారు. ప్రస్తుతం తనకు బాగానే ఉన్నదని ఆయన చెప్పారు.
ఎత్తైన ఎవరెస్ట్ పర్వతంపై మరెవరూ కరోనా బారిన పడకూడదని ఆశిస్తున్నట్లు నెస్ వెల్లడించారు. పర్వతాలపై గాలి పీల్చడం చాలా కష్టమని, అక్కడ కరోనా సోకితే పర్వతారోహకులకు చాలా ప్రమాదమని అన్నారు. అలాగే 8 వేల మీటర్ల ఎత్తులో ఉన్నవారిని అక్కడి నుంచి హెలికాప్టర్లో ఆసుపత్రికి తరలించడం కూడా కష్టసాధ్యమని తెలిపారు.
మరోవైపు ఈ సీజన్పై ఆశలు పెట్టుకున్న నేపాల్ ప్రభుత్వానికి ఈ ఘటన షాక్ ఇచ్చింది. కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది ఎవరెస్ట్ అధిరోహణ సీజన్ తుడుచుకుపోయింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎవరెస్ట్ అధిరోహకులు, టూరిస్ట్లకు క్వారంటైన్ నిబంధనలను నేపాల్ కాస్త సడలించింది. ఈ ఏడాది ఎవరెస్ట్ అధిరోహించేందుకు 377 మంది పర్వతారోహకులకు అనుమతి ఇచ్చింది. అయితే ఎవరెస్ట్పైనా కరోనా సోకిన ఘటన నేపాల్ ప్రభుత్వాన్ని కలవరపరుస్తున్నది.