చేతి ఖర్చులు, ఇతర అవసరాల కోసం నిత్యం అనేకమంది ఏటీఎం కేంద్రాలను ఆశ్రయిస్తుంటారు. డబ్బులు ఉపసంహరణ(విత్డ్రా) చేసుకున్నప్పుడు ఉన్న జాగ్రత్త లావాదేవీ పూర్తయి కార్డు తీసుకెళ్లడంలో చూపించడం లేదు. కొందరు మరచిపోవడం, అదే సమయంలో ఫోన్లు మాట్లాడుతూ హడావుడిగా వెళ్లిపోతూ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఇలా వదిలేసి వెళ్లిన కార్డులను కొందరు తస్కరించి దర్జాగా నగదు డ్రా చేసుకోవడం లేదా ఖాతాల్లోకి బదిలీ చేసుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఈనెల 25వ తేదీ వరకు నగరవ్యాప్తంగా 319 కార్డులను వదిలేసిపోగా, దాదాపు రూ.8.37 లక్షలను కాజేశారు.
కొత్తగా వస్తున్న వైఫై ఏటీఎం కార్డులకు నగదు డ్రా సమయంలో పిన్ నంబర్ అవసరం లేదు. రూ.2 వేల వరకు డ్రా లేదా కొనుగోలు చేసుకోవచ్చు. కొన్ని బ్యాంకులు రోజుకు 2 లేదా 3సార్లు డ్రా చేసుకునే సదుపాయం కల్పించాయి. ఈ కారణంగా చాలామంది డెబిట్, క్రెడిట్ కార్డుదారులు పిన్ నంబరు లేకున్నా వైఫైతో కూడిన కార్డు ద్వారా లావాదేవీలు జరిపేందుకు ఇష్టపడుతున్నారు. ఏటీఎం కేంద్రాలకు వెళ్లినప్పుడు చాలామంది కార్డుదారులు లావాదేవీ పూర్తయిన తర్వాత కార్డును మిషిన్లలోనే వదిలేసి పోతున్నారు. తర్వాత వచ్చిన వినియోగదారుడు కార్డును గుర్తించి దాన్ని పక్కకుపెట్టడమో లేదా బ్యాంకులకు అప్పగిస్తున్నారు. ఇలా వెళ్లిన వారిలో కొందరు కార్డును బ్లాక్ చేసుకుంటున్నారని ఇటీవల సైబరాబాద్ పోలీసులకు దొరికిన ఇద్దరు అనుమానితులతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది.
సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో కొంతమంది కార్డుదారులను ప్రశ్నించారు. వారంతా ఒకటే సమాధానం.. మరిచిపోతున్నామని. నగదుకు సంబంధించిన కార్డును మరచిపోతుండడాన్ని పరిశీలిస్తే వారంతా ఎంత తొందరపాటులో ఉన్నారనేది.. స్పష్టమవుతుందని పోలీసులు అంటున్నారు. కొంతమంది ఖాతాదారులైతే కార్డు భద్రత చర్యలు తీసుకోకుండానే హడావిడి పనుల్లో పడి మరచిపోతున్నామని జవాబిచ్చారు.
ఉద్యోగం కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి నగరానికి వచ్చిన ఇద్దరు యువకులు సులభంగా డబ్బు సంపాదించాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఇందుకోసం అనేక కోణాల్లో ఆలోచించారు. పలు ఏటీఎం కేంద్రాల వద్ద తిరిగినప్పుడు వైఫై ఉన్న కార్డులు దొరికాయి. దీంతో ఓ ప్రయత్నం చేయగా సక్సెస్ అయ్యింది. ఇంకా ఏమైనా దొరుకుతాయేమోనని తిరగగా.. మరికొన్ని దొరికాయి. ఆలోచనకు పదును పెట్టి రెండు పీవోఎస్ (పాయింట్ ఆఫ్ సేల్) మిషిన్లను కొనుగోలు చేశారు. ఆ మిషిన్ల ద్వారా వైఫైతో కూడిన కార్డులు దొరకగానే 2వేల వరకు డ్రా చేసి వారి ఖాతాల్లోకి డబ్బును బదిలీ చేసుకున్నారు. ఇలా వీరిద్దరు ఈ ఏడాది జనవరి నుంచి జూన్ 25వ తేదీ వరకు నగరంలోని పలు ఏటీఎం కేంద్రాలు తిరిగినప్పుడు మొత్తం 319 వైఫైతో కూడిన డెబిట్, క్రెడిట్ కార్డులు దొరికాయి. వీటినుంచి సుమారు రూ.8.37లక్షలు కాజేశారు. ఇందులో కొందరు వెంటనే కార్డులను బ్లాక్ చేసుకున్నప్పటికీ అప్పటికే చిన్న మొత్తంలో నగదు స్వైప్ అయిపోయింది.