జూబ్లీహిల్స్, ఏప్రిల్15: రోగులకు మెరుగైన వసతులు కల్పించడానికి కృషి చేస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నగదు పురస్కారాలు దక్కనున్నాయి. గత ఐదేండ్లుగా ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ‘కాయకల్ప’ పోటీలు నిర్వహించి, ప్రోత్సాహక బహుమతులందిస్తున్నారు. దవాఖానల్లో పరిశుభ్రతను కాపాడుకోవడంలో సిబ్బంది కృషిని ఈ పోటీల్లో గుర్తిస్తారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆరు సూత్రాలతో నిర్వహించే ‘కాయకల్ప’ చెక్లిస్ట్లో 100 శాతం మార్కులు పొందిన పీహెచ్సీకి రూ.2 లక్షలు నగదు బహుమతి ఇవ్వనున్నారు. స్వచ్ఛ భారత అభియాన్ కార్యక్రమంలో భాగంగా 2015 నుంచి నిర్వహిస్తున్న ఈ పోటీల్లో ఎంపికచేసిన పీహెచ్సీలు పాల్గొంటాయి. ఈ పోటీల్లో 70 శాతం మార్కులు వచ్చిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రూ.1.50 లక్షలు ద్వితీయ, రూ.ఒక లక్ష తృతీయ బహుమతులు దక్కనున్నాయి. ఆస్పత్రి అప్క్లీన్, వేస్ట్ మేనేజ్మెంట్, సపోర్ట్ సర్వీసెస్, హైజిన్ ప్రమోషన్, శానిటేషన్ అండ్ హైజిన్, ఇన్ఫెక్షన్ కంట్రోల్ తదితర అంశాలపై పీహెచ్సీలకు మార్కులు వేయనున్నారు. దవాఖాన అభివృద్ధి నిధులను సద్వినియోగం చేసుకుంటూ పీహెచ్సీలను పరిశుభ్రంగా ఉంచడం, సమర్ధవంతంగా వైద్య వ్యర్థాల నిర్వహణ ఇందులో కీలకంగా ఉండనున్నాయి. నిబంధనలకు అనుగుణంగా ఔషధాలు భద్రపరచడంతో పాటు పచ్చదనం-పరిశుభ్రత, దవాఖానలో సరైన నీటి సౌకర్యం.. తదితర అంశాలపై పీహెచ్సీల పరిధిలో ఈ పోటీలు నిర్వహించనున్నారు.
ఆరోగ్యకర వాతావరణాన్ని కల్పించే దిశగా కృషి చేస్తున్న పీహెచ్సీలను ప్రోత్సహించడంలో భాగంగా నిర్వహిస్తున్న కాయకల్ప పోటీలకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం శ్రీరాంనగర్ క్లస్టర్ పరిధిలోని బోరబండ పీహెచ్సీ ఎంపికైంది. ఇందులో భాగంగా సంబంధిత పీహెచ్సీలో రోగులకు మెరుగైన వసతులు కలిస్తూ, మౌలిక వసతులు పెంపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఇటీవల హైదరాబాద్ జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ జయమాలిని బోరబండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ దవాఖానను నామినేషన్కు పంపించడానికి కావాల్సిన అంశాలపై స్థానిక వైద్యాధికారి డాక్టర్ శ్రీవల్లి, సిబ్బందితో కలిసి చర్చించారు. కాగా ఈ పోటీలలో సదరు పీహెచ్సీలు సాధించే నగదు బహుమతులను దవాఖాన అభివృద్ధికి కేటాయిస్తారు.
ప్రతిష్టాత్మక కాయకల్ప పోటీలకు బోరబండ పీహెచ్సీ ఎంపికవడం ఆనందంగా ఉంది. ఈ పోటీల ప్రమాణాలకు అనుగుణంగా దవాఖానను తీర్చిదిద్దుతాం. దవాఖానలో రోగులకు మెరుగైన వసతులు కల్పించడం, పరిశుభ్రతపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తాం. హెచ్డీఎఫ్ నిధులతో పెయింటింగ్స్ తదితర పనులు చేపడుతాం. ఇప్పటికే వైద్య వ్యర్థాల నిర్వహణను బయో మెడికల్ ఆర్గనైజేషన్తో కలిసి చేపడుతున్నాం. దవాఖానలో నీటి వసతి మెరుగుపర్చడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ ఐ.శ్రీవల్లి, మెడికల్ ఆఫీసర్, బోరబండ పీహెచ్సీ.