ఉప్పొంగిన వాగులు, వంకలు
చెరువులు, ప్రాజెక్టులకు జలకళ
పరవళ్లు తొక్కుతున్న జలపాతాలు
కాలనీలు జలమయం.. ఇండ్లలోకి చేరిన వరద నీరు
ఆదిలాబాద్, జూలై 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి) :ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లాలో సగటు వర్షపాతం 68.2 మిల్లీ మీటర్లు నమోదు కాగా నిర్మల్ జిల్లాలో 67.9 మిల్లీ మీటర్ల వర్షం పడింది. సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి గురువారం ఉదయం వరకు ఎక్కువ వర్షం పడడంతో రెండు జిల్లాల్లో సాగునీటి వనరులు జలకళను సంతరించుకున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండగా, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో చెరువులు, ప్రాజెక్టుల్లో నీటమట్టం గణనీయంగా పెరిగింది. ఆదిలాబాద్ జిల్లాలోని జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రెండు జిల్లాల్లోని పత్తి, కంది, సోయాబీన్ పంటల్లో సైతం నీరు నిలిచింది. – ఆదిలాబాద్, జూలై 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లాలో సగటు వర్షపాతం 68.2 మిల్లీ మీటర్లు నమోదు కాగా, నిర్మల్లో 67.9 మిల్లీ మీటర్ల వర్షం పడింది. భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. సీజన్ ప్రారంభం నుంచి వర్షాలు పడుతుండడంతో చెరువులు, ప్రాజెక్టుల్లోకి ఇప్పటికే నీరు చేరింది. వర్షం కురుస్తుండడం, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టుల్లో ఇన్ఫ్లో పెరుగుతున్నది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులోకి 18,022 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, స్వర్ణ ప్రాజెక్టులో 2,860 క్యూసెక్కుల నీరు చేరుతున్నది. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల ప్రాజెక్టులోకి 93.68 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. వర్షపు నీటి కారణంగా ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల, పొచ్చెర, కొరిటికల్, గాయత్రి జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి వరద చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సీజన్ ప్రారంభం నుంచి వర్షాలు పంటలకు అనుకూలంగా పడుతుండడంతో పత్తి, కంది, సోయాబీన్ మొక్కలు బాగా పెరిగాయి. వర్షపు నీరు చేలలోకి చేరడంతో కొంత నష్టం వాటిల్లిందని రైతులు అంటున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో 68.2.. నిర్మల్లో 67.9 మిల్లీ మీటర్లు
ఆదిలాబాద్ జిల్లాలో సగటు 68.2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఉట్నూర్ మండలంలో అధికంగా 159.4 మిల్లీ మీటర్లు, నేరడిగొండలో 149.2, జైనథ్లో 8.2, బేలలో 7.2, గుడిహ త్నూర్లో 18.2, ఆదిలాబాద్ మండలంలో 104.2, తాంసిలో 37.4, తలమడుగులో 65.8, బజార్హత్నూర్లో 58.2, బోథ్లో 102, ఇచ్చోడలో 45.4, నార్నూర్లో 103.3, ఇంద్రవెల్లిలో 28.4 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. నిర్మల్ జిల్లాలో సగటు 67.9 మిల్లీ మీటర్ల వర్షం నమోదైం ది. అధికంగా కడెంలో 119 మిల్లీ మీటర్లు కురవగా.. కుభీర్లో 68.2, తానూర్లో 28.4, బాసరలో47.5, మథోల్లో 53.8, భైంసాలో 48.6, కుంటాలలో 65.6, నర్సాపూర్(జి)లో 56.8, లోకేశ్వరంలో 62.4, దిలావర్పూర్లో 112.8, సారంగాపూర్లో 97.6, నిర్మల్లో 69.2, నిర్మల్ రూరల్ 74.8, సోన్లో 71.3, లక్ష్మణచాందలో 118.4, మామడలో 15.2, పెంబిలో 35, ఖానాపూర్లో 57, దస్తూరాబాద్లో 90.8 మిల్లీ మీటర్ల వర్షం పడింది.
ప్రాజెక్టు గేటు ఎత్తివేత
కుమ్రం భీం ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు చేరుతున్నది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 10.393 టీఎంసీలు కాగా.. 1011 క్యూసెక్యుల వరద ప్రాజెక్టులోకి వస్తున్నది. ఈ క్రమంలో ప్రాజెక్టు గేటు ఎత్తి దిగువనకు 1400 క్యూసెక్కుల నీటిని వదిలారు. కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 9.132 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కెరమెరి మండలంలోని బాబేఝరి జలపాతం జలకళను సంతరించుకున్నది. పచ్చని చెట్లు, మధ్యలో జలపాతం సుమారు 110 అడుగుల ఎత్తు నుంచి పాల నురగ లాంటి నీరు దిగువకు జారుతూ కనువిందు చేస్తున్నది. మంచిర్యాల జిల్లాలోని నస్పూర్, తాండూర్, రామకృష్ణాపూర్ ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి.