సిటీబ్యూరో, జూన్ 15(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ జిల్లాలో తెల్ల రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బీపీఎల్కి దిగువున ఉన్న వారంతా తెల్ల రేషన్ కార్డుల కోసం ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే దాదాపు ఒక లక్ష వరకు దరఖాస్తు చేసుకున్నారు. వారందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా హైదరాబాద్ జిల్లాలోని తొమ్మిది సర్కిళ్ల వారీగా దాదాపు ఒక లక్ష వరకు తెల్ల కార్డుల కోసం దరఖాస్తులు వచ్చాయి. ఈ సారి తెల్ల రేషన్ కార్డుల జారీకి సంబంధించిన మార్గదర్శకాలను ఒకటి రెండు రోజులలో ప్రభుత్వం విడుదల చేసి, అన్ని జిల్లా రేషనింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నారు. దీని ఆధారంగా తెల్ల రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల చేసుకున్న వారి ఇంటి అడ్రసుల వారీగా తనిఖీలు నిర్వహిస్తారు. వారి ఆర్థిక పరిస్థితులను, కుటుంబ సభ్యులు, వృత్తి వంటి వివరాలను వ్యక్తిగతంగా సేకరించనున్నారు. ఆ వివరాలు అన్ని సక్రమంగా ఉన్నట్లు నిర్ధారణ అయితేనే, దరఖాస్తుదారులకు కొత్త రేషన్ కార్డు జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారు.