నాగ్పూర్, ఆగస్టు 10: మంత్రులు ఏం చెప్పినా ఐఏఎస్లు, ఐపీఎస్లు ‘యస్ సార్’ అంటూ తలాడించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. ఐఏఎస్ల ఆదేశాలను బట్టి ప్రభుత్వం నడవదని, మంత్రులకు నచ్చినట్లే ప్రభుత్వం నడుస్తుందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు మహారాష్ట్రలోని నాగ్పూర్లో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
‘మీరు చెప్పినట్లు ఏ ప్రభుత్వం నడవదని నేను తరుచూ ఐఏఎస్లు, ఐపీఎస్లకు చెబుతుంటాను. మంత్రులు ఏది చెబితే అదే సాగుతుంది. ప్రభుత్వాన్ని నడిపేది మేమే. కాబట్టి, మంత్రులు ఏం చెప్తే దానికి ‘యస్ సార్’ అంటూ ఐఏఎస్లు చేస్తూ పోవాలి’ అ న్నారు. ‘పేద ప్రజలను రక్షించేందుకు, వారి సంక్షేమం కో సం ఏ చట్టం కూడా రాదు. అలాంటి చట్టాన్ని పదిసార్లు ఉల్లంఘించడానికి కూడా మనం సంకోచించకూడదు. ఇది మహాత్ముడే చెప్పారు’ అని అన్నారు.
ఈ మేరకు గడ్కరీ ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు. 1995లో గడ్రిచోలీ, మేల్ఘాట్ గ్రామాల్లో పోషకాహార లోపంతో వేలాది మంది గిరిజన చిన్నారులు మృత్యువాత పడ్డారని, వారికి వైద్య సాయం అందించడానికి ఆ కుగ్రామాలకు రోడ్ల సౌకర్యం కూడా లేదన్నారు. ఘటన జరిగిన తర్వాతే రోడ్ల అభివృద్ధికి అటవీ చట్టాలు వచ్చాయన్నారు.