మెహిదీపట్నం:నాంపల్లి నియోజకవర్గం ఆసిఫ్నగర్ డివిజన్ దాయీబాగ్లో ఉన్న హనుమాన్ బాలాజీ ఆలయం 13 వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగో రోజు గురువారం బాలాజీ వెంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఆలయ ట్రస్టు అద్యక్షులు పి సత్యంచారి, సలహాదారులు పి లక్ష్మయ్య, బ్రహ్మోత్సవ కమిటీ అద్యక్షులు గొరిగె శ్రీనివాస్, ట్రస్టు ప్రధాన కార్యదర్శి బి రమేష్కుమార్ నేతృత్వంలో యజ్ఞాచార్యులు అరుణ్ కుమార్ చార్యులు, వేదాంతం రాజసింహా చార్యుల పర్యవేక్షణలో ఆలయం ఆవరణలో జరిగిన ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ఆసిఫ్నగర్ పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
గుడిమల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్, జియాగూడ కార్పొరేటర్ బోయిని దర్శన్లతో పాటు పలువురు పాల్గొని పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని బ్రహ్మోత్సవ కమిటీ అద్యక్షులు గొరిగె శ్రీనివాస్ తెలిపారు.