బన్సీలాల్పేట్, ఆగస్టు 22 : చారిత్రాత్మక సంపదను, పురాతన కట్టడాల పరిరక్షణ, బావుల పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ సర్కారు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం ఆయన కార్పొరేటర్ కే.హేమలత, జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ కమీశనర్ బి.శ్రీనివాస్ రెడ్డిలతో కలసి బన్సీలాల్పేట్లోని పురాతన మెట్ల బావి పునరుద్ధరణ పనులను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. 40 ఏండ్ల క్రితం స్థానికులు ఈ బావిలోని నీటిని అనేక రకాలుగా వినియోగించేవారని అన్నారు.
కాలక్రమేణా చెత్తాచెదారం వేయడం వలన పూర్తిగా మూసుకుపోయి, నిరుపయోగంగా మారిందని అన్నారు. ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకు రావడంతో స్థానికుల కోరిక మేరకు బావి పునరుద్ధరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. దాంతో భూగర్భ జలాలు కూడా మరింత వృద్ధి జరుగుతుందని అన్నారు. కేవలం 15 శాతం పనులు పూర్తి కాగానే, ఫలితాలను ప్రజలు చూస్తున్నారని, 30 అడుగులకే నీళ్లు వస్తున్నాయని తెలిపారు. పునరుద్ధరణ పనులు పూర్తి అయ్యాక ఈ బావిలో మంచినీరు ఎల్లప్పుడూ ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.
భావితరాలకు చరిత్రను తెలియజేసే ఇలాంటి చారిత్రాత్మక కట్టడాలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ బేగంపేట్ డీసీ ముకుందరెడ్డి, ఈఈ శివానంద్, జలమండలి ఏఈ శశాంక్, ‘ది రెయిన్వాటర్ ప్రాజెక్ట్’ వ్యవస్థాపకురాలు కల్పనా రమేశ్, టీఆర్ఎస్ నాయకులు కె.లక్ష్మిపతి, వెంకటేశన్రాజు, ప్రేమ్కుమార్, కమల్కుమార్, దేశపాక శ్రీను, శ్రీకాంత్, జ్ఞాని, బన్సీలాల్పేట్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఫహీమ్, కార్యదర్శి పురుశోత్తమ్, సీమ, భాగ్యలక్ష్మి, జావెద్ తదితరులు పాల్గొన్నారు.