అమీర్పేట్:తమ సమస్యల పరిష్కారంకోసం ప్రైవేట్ ఉద్యోగులు తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగులు, కార్మికుల సంఘం పట్ల పూర్తి నమ్మకంతో ఉన్నారని సంస్థ నూతన అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన పాలడుగు రాజేందర్ పేర్కొన్నారు. స్వార్థ ప్రయోజనాలతో పార్టీలు మారే వారి వల్ల సంస్థకు ఎటువంటి నష్టం లేదని, మరింత సమర్ధులైన నాయకులతో కలిసి సంస్థను విస్తరించేందుకు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తామన్నారు.
తెలంగాణ పైవేట్ ఉద్యోగులు, కార్మకుల సంఘం అధ్యక్షులుగా కొనసాగిన సామ వెంకట్రెడ్డి ఇటీవలే పార్టీ మారడంతో సంస్థ రాష్ట్ర నాయకత్వం సమావేశమై పాలడుగు రాజేందర్ను నూతన అధ్యక్షునిగా ఎంపిక చేసింది. ఈ మేరకు బుధవారం ఎస్ఆర్నగర్లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశానికి సంస్థ ప్రతినిధులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ సర్కార్ అన్ని వర్గాల సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో పని చేస్తోందని, పని చేసే ప్రభుత్వంతోనే సమస్యల పరిష్కారాలు సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర నాయకులు కూతురు నర్సింహ, కట్టా బలరామ్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.