విచ్చలవిడిగా వెలువడుతున్న పారిశ్రామిక వ్యర్థాలు, జనావాసాల నుంచి వస్తున్న మురుగునీటి శుద్ధిలో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (ఎస్టీపీ) అత్యంత కీలకం. ఇప్పటికే మూసీ పరీవాహక ప్రాంతంలో పలుచోట్ల ఎస్టీపీలు పనిచేస్తుండగా..హుస్సేన్సాగర్కు అనుసంధానమైన కూకట్పల్లి నాలాపై 15 చోట్ల, మూసీ పరీవాహక ప్రాంతంలో రెండు చోట్ల మురుగునీటి శుద్ధి కేంద్రాలు నిర్మించాలని జలమండలి ప్రణాళికలు సిద్ధం చేసింది. రూ.1280 కోట్ల వ్యయంతో 17 చోట్ల నిర్మించే ఈ కేంద్రాల్లో నిత్యం 376.5 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ పర్ డే)ల మురుగునీటిని శుద్ధి చేసి దిగువకు వదులుతారు. ఇందులో భాగంగా ఫతేనగర్ వద్ద 100 ఎంఎల్డీల మురుగు శుద్ధి చేసే ఎస్టీపీ నిర్మాణ పనులకు శుక్రవారం పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. కూకట్పల్లి నాలా నుంచి వస్తున్న పారిశ్రామిక వ్యర్థాలను కట్టడి చేసి శుద్ధి చేయడమే దీని ప్రధాన లక్ష్యం.
గ్రేటర్వ్యాప్తంగా జనాభా కోటి దాటగా.. నిత్యం 2వేల మిలియన్ లీటర్ల మురుగు ఉత్పత్తి అవుతోంది. ప్రస్తుతమున్న ఎస్టీపీలకు రోజుకు 750 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేసే సామర్థ్యం ఉంది. మిగతాది ఎలాంటి శుద్ధి లేకుండా మూసీలో కలుస్తున్నది. ప్రతిపాదిత ఎస్టీపీలతో దాదాపు 376 మిలియన్ లీటర్లను శుద్ధి చేయొచ్చు. అన్నింటి నిర్మాణాలు పూర్తయి అందుబాటులోకి వస్తే రోజుకు 1126 ఎంఎల్డీల నీరు శుద్ధి కానుంది. మూసీ ప్రక్షాళనలో భాగంగా కూకట్పల్లి నాలా పరీవాహక ప్రాంతాల పరిధిలో నూతన మురుగు శుద్ధి కేంద్రాల (ఎస్టీపీల) ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
హుస్సేన్సాగర్ పరిరక్షణలో భాగంగా కూకట్పల్లి నాలాలో పారిశ్రామిక వ్యర్థాలను కట్టడి చేయడంతో పాటు శుద్ధి చేసిన నీరు మూసీలోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జలమండలి అధికారులు కూకట్పల్లి నాలా పరీవాహక ప్రాంతంలో 15 చోట్ల ఎస్టీపీలు, మూసీ పరీవాహక ప్రాంతాల్లో మరో రెండు మురుగునీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. గ్రేటర్ వ్యాప్తంగా మూడు దశల్లో 62 ప్రాంతాల్లో మురుగు నీటి శుద్ధి (ఎస్టీపీలు)కేంద్రాలను నిర్మించాలన్న ప్రతిపాదనలో ప్యాకేజీ-3 కింద తొలి విడతగా రూ.1280 కోట్లతో నిత్యం 376.5 మిలియన్ లీటర్ల (ఎంఎల్డీ) సామర్థ్యంతో 17 ప్రాంతాల్లో కొత్తగా ఎస్టీపీలు నిర్మిస్తున్నారు.
కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్ల పరిధిలో జరిగే ఈ ఎస్టీపీ పనులను అండర్ హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (ప్రైవేట్ ఏజెన్సీ వాటా 60శాతం, ప్రభుత్వ వాటా 40 శాతం) పద్ధతిలో చేపడుతున్నారు. ఇందులో భాగంగానే ఫతేనగర్ వద్ద 100 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేసేందుకు నిర్మించ తలపెట్టిన ఎస్టీపీ పనులకు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. గ్రేటర్కు చెందిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సీహెచ్ మల్లారెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు కుర్మయ్యగారి నవీన్కుమార్, వాణీదేవి పాల్గొననున్నారు.
గ్రేటర్ వ్యాప్తంగా నిత్యం 2వేల మిలియన్ లీటర్లు మురుగు ఉత్పత్తి అవుతున్నది. ఇందులో కేవలం 750 మిలియన్ లీటర్లు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసి మూసీలోకి విడిచిపెడుతున్నారు. మిగతావి ఎలాంటి శుద్ధి లేకుండా మూసీలో కలుస్తున్నాయి. దీంతో మూసీ దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే కొత్తగా ఏర్పాటు చేయనున్న ఎస్టీపీలతో దాదాపు 376 మిలియన్ లీటర్ల మురుగును శుద్ధి చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా జీడిమెట్ల ఫాక్స్ సాగర్ నుంచి హుస్సేన్సాగర్ వరకు దాదాపు 9 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న కూకట్పల్లి నాలా ద్వారా ప్రతిరోజు దాదాపుగా 250 ఎంఎల్డీల మేర మురుగునీరు వస్తున్నది.
ఇందులో 60-80 ఎంఎల్డీ మేర పైపులైన్ ద్వారా కాకుండా నేరుగా సాగర్లోకి వచ్చి చేరి జలాలను కలుషితం చేస్తున్నాయి. అయితే స్వచ్ఛ హుస్సేన్సాగర్గా మార్చే క్రమంలో రంగధాముని చెరువు, ఖాజాగూడ వద్ద రెండు ఎస్టీపీలు నిర్వహణలో ఉండగా నూతనంగా ఫాక్స్ సాగర్, శివాలయనగర్, పరికిచెరువు, అంబీర్చెరువు (ప్రగతినగర్), మల్లమ్మకుంట చెరువు, ముళ్లకత్వ చెరువు, కాముని చెరువు, ఐడీపీఎల్ గాంధీనగర్, ఐడీపీఎల్ టౌన్షిప్, ఫతేనగర్ తదితర ప్రాంతాల్లో నూతన ఎస్టీపీలను ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా ఎక్కడికక్కడ మురుగునీటిని శుద్ధి చేసి అటు హుస్సేన్సాగర్, ఇటు మూసీ నదిని పరిరక్షించడమే లక్ష్యంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోనున్నారు.
మూసాపేట సర్కిల్ పరిధి ఫతేనగర్ ఎల్బీఎస్నగర్లో ఎస్టీపీ ప్లాంట్ను పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించనున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఈ సందర్భంగా గురువారం స్థానిక కార్పొరేటర్ పండాల సతీశ్గౌడ్తో కలిసి ఆయన ఎల్బీఎస్నగర్లో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే నగరాభివృద్ధి జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలో హైదరాబాద్ నగరం గతంలో ఎప్పుడూ లేని విధంగా సర్వాంగసుందరంగా తీర్చబడుతుందని తెలిపారు.
నగరంలోని నాలాల అభివృద్ధికి ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఈ నేపథ్యంలోనే కూకట్పల్లి నియోజకవర్గం పరిధి ఫతేనగర్లో రూ.230 కోట్ల నిధులతో సీవరేజీ ట్రీట్మెంట్ (ఎస్టీపీ) ప్లాంట్ నిర్మించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం హర్షణీయమని అన్నారు. ఓల్డ్బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్, బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్రెడ్డి, బోయిన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ నరేందర్గౌడ్, కె.రాములు, స్థానికులు పాల్గొన్నారు.
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో హడ్కో, ఓఆర్ఆర్ తాగునీటి పథకాలతో ఔటర్ రింగు రోడ్డు లోపలి గ్రామాల వరకు తాగునీటి వ్యవస్థను బలోపేతం చేసిన సర్కార్ ప్రస్తుతం మురుగునీటికి శాశ్వత పరిష్కారంపై దృష్టి సారించింది. ఉమ్మడి పాలకులు నగర శివారులోని 12 మున్సిపాలిటీలను గ్రేటర్లో విలీనం చేసి చేతులు దులుపుకున్నారు. జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులైన తాగు, మురుగునీటి వ్యవస్థలను ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారు.
టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సమృద్ధిగా నీరు అందిస్తున్నది. ఔటర్ రింగు రోడ్డు లోపలి గ్రామాల పరిధి వరకు సేవలను విస్తరించుకుని ఆ దిశగా సీవరేజీకి ప్రత్యేక మాస్టర్ప్లాన్ రూపకల్పన చేసింది. విడతల వారీగా నూతన ఎస్టీపీలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నది. ఫతేనగర్లో 11ఎకరాల విస్తీర్ణంలో 33.78 స్కేర్ కిలోమీటర్ల పరిధిలో 100 మిలియన్ లీటర్ల మురుగు శుద్ధి జరుగనున్నది. 2036 సంవత్సర జనాభాను దృష్టిలో ఉంచుకుని ఈ ఎస్టీపీని ఏర్పాటు చేస్తున్నారు.