మార్కెట్లో దొరికే తినుబండారాలు, శీతల పానీయాల్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల అనేక వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం ఉంటుందని ‘వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్’ (డబ్ల్యూహెచ్ఓ) చెబుతున్నది. సమస్య నివారణ చర్యల్లో భాగంగా ఈ సంస్థ నిపుణులు సోడియం కంటెంట్పై ఇటీవలే కొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు. అధికారిక లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 1.1 కోట్లమంది ప్రజలు పోషకాహార లోపంతో చనిపోతున్నారు. వారిలో 30 లక్షలమంది అతిగా సోడియం తినడం వల్లే మరణిస్తున్నారంటున్నారు నిపుణులు. ముఖ్యంగా, రెడీ-టు-ఈట్ పదార్థాలు, బ్రెడ్, ప్రాసెస్డ్ మీట్, చీజ్ వంటి డెయిరీ పదార్థాల్లో సోడియం శాతం ఎక్కువగా ఉంటున్నదని ‘డబ్ల్యూహెచ్ఓ’ చెప్తున్నది. ఉప్పు శాస్త్రీయ నామమే సోడియం క్లోరైడ్. సోడియం (లవణం) శరీరంలోని నీటిశాతాన్ని నియంత్రిస్తుంది. దీనిని అవసరం కంటే ఎక్కువగా వాడితే ఆరోగ్యం పాడవుతుందన్నది స్పష్టం. డబ్ల్యూహెచ్ఓ ఆహార ఉత్పత్తులపై కొన్ని నిబంధనలు విధించింది. ఉదా॥కు 100 గ్రాముల ఆలుగడ్డ చిప్స్లో 500 మిల్లీగ్రాములకు మించి, ప్రాసెస్డ్ మీట్లో 360 మిల్లీగ్రాములకు మించి సోడియం ఉండకూడదని మార్గదర్శకాలు జారీ చేసింది. ఎక్కువ మోతాదులో సోడియం తీసుకుంటే రక్తపోటు కూడా పెరుగుతుంది. సోడియం మోతాదు పెరిగితే గుండెజబ్బులు, ఒబేసిటీ, కిడ్నీ సమస్యలు, జీర్ణకోశ క్యాన్సర్ వంటి రుగ్మతలూ రావచ్చు. అందువల్ల ప్రతి ఒక్కరూ రోజుకు 5 గ్రాములకంటే ఎక్కువ ఉప్పు తినొద్దు.