నీరు ఎక్కడుంటే అక్కడ వ్యవసాయం, పశుసంపద ఉంటుంది. ఈ రెం డూ ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది. విద్య, వైద్యం, ఆరోగ్యం, పరిశ్రమలు అన్నీ అక్కడే ఉంటాయి. ఇవన్నీ ఉన్నచోట ప్రజలు సుఖశాంతులతో ఉం టారు. కాబట్టి, సకల సంపదల సృష్టికి నీరు మాత్రమే ప్రధానమైన ఆధారం. ‘గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు’ అనే గాంధీజీ సూక్తికి నిదర్శనంగా ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసిపట్టి ఇంకుడుగుంతలు, ఊరిచుట్టూ కందకాలు, చెక్డ్యామ్లు నిర్మించి నీటి సంరక్షణలో గ్రామస్తులందరూ పాల్గొన్నందుకు ఆజాదీ ఉత్సవాల సందర్భంగా జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం రాగోజీపేట గ్రామా న్ని ఇటీవల కేంద్ర పంచాయత్రాజ్ శాఖ ప్రశంసించినందుకు గర్వపడాలి.
ప్రతి నీటిబొట్టుకు విలువనిద్దాం..
నీటికి విలువివ్వడం, నీటి విలువను గుర్తెరిగి వ్యవహరించడం నేటి అవస రం. మార్చి 22వ తేదీని ‘ప్రపంచ నీటి దినోత్సవం’గా ప్రకటించిన ఐక్యరాజ్యసమితి, ఈ సంవత్సరం ప్రచారాంశంగా దానినే (వ్యాల్యూయింగ్ వాటర్) ఎం చుకున్నది. ‘బావి ఎండినపుడే.. నీటి విలువ’ తెలుస్తుంది అనేది సామెత. ప్రపంచంలో 150 దేశాల్లో నీటి ఎద్దడి ఉన్నట్లుగా యుఎన్ గుర్తించింది. వీటిలో భారతదేశం కూడా ఉన్నప్పటికీ నీటి సంరక్షణకు సంబంధించిన ఎన్నో పథకాలను అమలుచేయటం వల్ల పరిస్థితిలో మార్పు వస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం నీటికిస్తున్న ప్రాధాన్యం చాలా గొప్పది. ముఖ్యమంత్రి సుదూర ఆలోచనలతో వేసవి కాలంలో కూడా గ్రామాల్లోని చెరువులు కుంటలు నీటితో నిండుకుండల్లాగా ఉ న్నాయి. మిషన్ కాకతీయ కింద 45 వేల చెరువులను పునరుద్ధరించారు. భూగ ర్భ జలాలు పెరిగాయి. పశు సంపద గణనీయంగా పెరిగింది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ కుళాయిల ద్వారా నీటి సరఫరా కొనసాగుతున్నది.
సమసిపోయిన ఫ్లోరైడ్ సమస్య
మిషన్ భగీరథ నీటితో నల్లగొండ జిల్లాలోని పలు గ్రామాల్లో తరతరాలుగా పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్య సమసిపోయింది. కేంద్ర జలశక్తి అభియాన్ ఇటీవలి నివేదిక ప్రకారం, దేశంలో 2500 ఫ్లోరైడ్ పీడిత గ్రామాలుండగా, తెలంగాణలో ఒక్క గ్రామం కూడా లేదు. రాష్ట్రంలో నీటి సంక్షోభం లేకుండా 270 టీఎంసీ కెపాసిటీతో ఆసియాలోనే ఒక అద్భుతమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని కేవలం మూడున్నరేండ్లలో నిర్మించడం, మరోవైపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వల్ల ప్రభుత్వం అనుకున్న విధంగా కోటీ 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా భూగర్భ జలాలు పుష్కలంగా పెరుగుతాయి. నీటి సంపదకు పచ్చదనం కూడా ఒక కారణం. కాబట్టి, తెలంగాణకు హరితహారం పేరుతో రాష్ట్రంలో 33 శాతం అటవీ అభివృద్ధిని చేసే క్రమంలో పచ్చదనాన్ని పెంచడం వలన కూడా వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం ఉంటుంది.
నాలుగేండ్లుగా జలమండలి చర్యలు
నీటి ప్రాధాన్యం విషయంలో హైదరాబాద్ జలమండలి నాలుగేండ్లుగా అనేక చర్యలు చేపట్టింది. మంత్రి కేటీఆర్ జలం జీవంలో ఇచ్చిన పిలుపుతో ప్రజాచైతన్య కార్యక్రమాలను నిర్వహించింది. దేశంలోనే రెండో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్క్ను హైదరాబాద్ జూబ్లీహిల్స్లో నెలకొల్పాం. వివిధ కాలనీలలో జలమండలి నిర్మించిన సుమారు పదివేల ఇంకుడు గుంతలను 14 మంది స్వచ్ఛంద సంస్థల సహకారంతో మరమ్మతులు చేసి 81వేల క్యూబిక్ మీటర్ల వాల్యూమ్తో 11 లక్షల 95వేల కిలోలీటర్ల వర్షపు నీటిని సంరక్షించాం. మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా కూడా వివిధ ఎన్జీవోల సహకారంతో నీటి ప్రాధాన్యంపై అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
వర్షపు నీటి సంరక్షణ అందరి బాధ్యత
వాన నీటిని సంరక్షించుకోవడం ప్రతి వ్యక్తి తన బాధ్యతగా భావించాలి. నీటి క్రమశిక్షణను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి. ఒక మనిషి ఒకరోజు ఒక లీటర్ నీటిని ఆదా చేస్తే కోటి జనాభా ఉన్న నగరంలో కోటి లీటర్లు ఆదా అవుతుంది. బకెట్తో అయ్యే పని పైపుతో చేయడం వల్ల అధిక మొత్తంలో నీరు వృథా అవుతుంది. ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు తప్పనిసరిగా నిర్మించుకోవా లి. సుస్థిర అభివృద్ధి లక్ష్యం-6 వైపుగా పయనిస్తున్నందున 2030నాటికి వాటర్ అండ్ శానిటేషన్ రంగంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే అందరు నీటి ప్రాధాన్యాన్ని గుర్తించి బాధ్యతగా వ్యవహరించాలి.