సిటీబ్యూరో, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : వర్షాకాలంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ దానకిశోర్ అధికారులను ఆదేశించారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందాలు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. వర్షాకాల కార్యచరణ, సీవరేజీ ఓవర్ ఫ్లో, మంచినీటి సరఫరా తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎండీ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. రానున్న వర్షాకాలంలో జలమండలి అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, ఎక్కువ లోతు ఉన్న మ్యాన్ హోల్స్కు సేఫ్టీగ్రిల్స్ను ఏర్పాటు చేయాలని సూచించారు. డ్రైనేజీ పనులకు సంబంధించి శిథిలాలు ఉంటే వెంటనే తొలగించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండ నోడల్ అధికారులను నియమించి మూడు షిఫ్టులలో పనిచేసే విధంగా చూడాలని, ఎమర్జెన్సీ టీంలను 24 గంటలు అందుబాటులో ఉంచాలని తెలిపారు. వాటర్ బోర్డు, జీహెచ్ఎంసీలోని వాటర్ లాగింగ్ పాయింట్లను నిత్యం పర్యవేక్షించాలని, క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారులు ప్రత్యేక శద్ధ్ర వహించాలని ఆదేశించారు. సీవరేజీ ఓవర్ ఫ్లో, కలుషిత నీటిపై వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు. తరుచుగా సీవరేజీ ఓవర్ ఫ్లో అయ్యే ప్రాంతాలను గుర్తించి మ్యాన్ హోళ్లు ఉప్పొంగకుండ ముందస్తు నిర్వహణ చర్యలు తీసుకోవాలన్నారు.
రానున్న వర్షాకాలంలో నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండ చర్యలు తీసుకుంటున్నామని ఎండీ దానకిశోర్ తెలిపారు. ఇప్పటికే మ్యాన్హోళ్లకు సేప్టీగ్రిల్స్ను ఏర్పాటు చేశామని, రూ.8కోట్ల వ్యయంతో 10,120 మ్యాన్హోళ్లకు మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. అత్యవసర పనులు చేపట్టేందుకు ప్రతి డివిజన్కు ఈఆర్టీ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నీళ్లు నిలిచే సుమారు 140 ప్రాంతాల్లో మ్యాన్ హోళ్లకు సేఫ్టీగ్రిల్స్ ఏర్పాటు చేశామన్నారు. లోతుగా ఉన్న మ్యాన్హోళ్ల దగ్గర సూచికబోర్డులను ఏర్పాటు చేయాలని, క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది, అధికారి జలమండలి యూనిఫాంను ధరించాలని సూచించారు. తాగునీటి లైన్ క్రాసింగ్ వద్ద చెత్త చేరకుండ చర్యలు తీసుకోవాలన్నారు. నగర ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాన్హోల్ మూతలను తెరవకూడదని సూచించారు. ఎక్కడైన మ్యాన్హోల్ మూత ధ్వంసమైనా, తెరిచి ఉన్నట్లు గుర్తించినా జలమండలి కస్టమర్కేర్ నంబర్ 155313కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. అనంతరం జలమండలి నగర వాసులకు ఉచితంగా మంచినీటి పథకం పురోగతిని రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో ఈఎన్సీ ఆపరేషన్స్ డైరెక్టర్ అజ్మీరా కృష్ణ, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్.ప్రవీణ్కుమార్లతో పాటు ఓఅండ్ ఎం సీజీఎంలు, జీఎంలు పాల్గొన్నారు.