“చాలా మంది హైదరాబాద్ నుంచి అమెరికాలోని కంపెనీలకు ఇంటర్వ్యూకు హాజరవుతారు.” ఇది కామన్. కానీ అమెరికా నుంచి హైదరాబాద్ కంపెనీకి ఇంటర్వ్యూకు హాజరవ్వడం చాలా అరుదుగా జరుగుతుంది. అంతేకాదు ఉద్యోగం సంపాదించి అదే కంపెనీకి సీఓఓ, డైరెక్టర్గా ఎదగడం కూడా గొప్ప విషయమే. అది సాహితీ స్నిగ్ధకే సాధ్యమైంది. తాను పుట్టిన ఊరికి సేవలు అందించాలనే బలమైన లక్ష్యంతో అమెరికా నుంచి సొంతూరు బాట పట్టారు. యూఎస్లో మాస్టర్ ఇన్ గ్రీన్టెక్నాలజీ చదివి.. వేస్ట్ వెంచర్స్ ఇండియాలో మేనేజర్గా చేరారు. 2018లో మొదలైన ఆమె ఉద్యోగ ప్రస్థానం తన పని నిబద్ధతతో తక్కువ వ్యవధిలోనే అనేక మైలురాళ్లను సాధించింది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ఆమెను రీసైక్లింగ్ హీరోయిన్గా ఎంపికచేసే స్థాయికి చేరుకుంది.
నగరంలోని మోతీనగర్కు చెందిన సాహితీ స్నిగ్ధ పనిచేసే కంపెనీలో 80 మంది ఉద్యోగుల్లో 60 మంది మహిళలే ఉండటం విశేషం. బాచుపల్లి, ఖానాపూర్లో బ్రాంచీలను ఏర్పాటు చేసింది. కేవలం పనిలోనే కాకుండా సామాజిక సేవలోనూ ఆదర్శంగా నిలుస్తుంది. ప్రకృతి రక్షణకు తన వంతు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. విద్యార్థులకు వేస్టేజ్పై అవగాహన కల్పిస్తుంది. అనేక కార్యక్రమాల్లో వక్తగా పాల్గొని సేవ్ నేచర్ అంటూ మెసేజ్ ఇస్తుంది. కరోనా క్లిష్ట సమయంలోనూ నిత్యావసర సరుకులు, శానిటైజర్ కిట్స్, వైద్య శిబిరాలు నిర్వహించి సేవా దృక్ఫథాన్ని చాటుకుంది. వ్యర్థాల రీసైక్లింగ్లో తెలంగాణ నుంచి జాతీయపురస్కారం అందుకుంది.
నా లక్ష్యం.. పెండ్లిఅయ్యాక కూడా కొనసాగింది. మంత్రి కేటీఆర్ నాకు ఆదర్శం. ఆయన స్టార్టప్ల వృద్ధికి చేస్తున్న కృషి అమోఘం. తక్కువ కాలంలోనే తెలంగాణ ప్రపంచమంతా పరిచయం అయ్యేల చేసిన ఘనత ఆయనది. చాలా మంది యువత విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేయాలని భావిస్తారు. కానీ తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్లకు ఇస్తున్న ప్రోత్సాహంతో.. ఇక్కడే వేలాది మందికి ఉపాధినిచ్చే స్థాయికి ఎదుగొచ్చు. అలాంటి వాతావరణం కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.- సాహితీ స్నిగ్ధ, రీసైక్లింగ్ హీరోయిన్
సాహితీ ఎదుగుదలలో టీ-హబ్ క్రియాశీలక రోల్ పోశించింది. టీ హబ్తో ఏడాదిన్నర పాటు భాగస్వామ్యం కుదుర్చుకుని కలిసి పనిచేసింది. ఈ క్రమంలో అనేక మంది ఇన్వెస్టర్లతో చర్చించే అవకాశం పొందడం.. అనుభవం గల నిపుణుల సలహాలు తీసుకోవడం.. ఆలోచనను కార్యాచరణలోకి మార్చడంపై పూర్తి అవగాహన సంపాదించింది. సోషల్ సెక్టార్లో రాణించడంపై పూర్తి అధ్యయనం చేసింది. అనంతరం తన వృత్తిలో వీటిని ఐప్లె చేస్తూ నేడు స్ఫూర్తివంతమైన మహిళగా నిలిచింది.