సిటీబ్యూరో, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : ఊపిరి ఆడని వాసనలు.. ఆ ప్రాంత ప్రజలను రోజూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నోట్లో బువ్వ కూడా దిగడం లేదు. బోర్లు వేస్తే.. ఎరుపు రంగులో నీళ్లు దుర్వాసనతో ఉబికి వస్తాయి. వాటిని తాకితే.. ఒళ్లంత దద్దుర్లు.. మరికొద్ది రోజులకు తీవ్రమైన చర్మ వ్యాధులు…నగర శివారులోని కొన్ని పరిశ్రమల యాజమాన్యాలు చేస్తున్న నిర్వాకంతో జీడిమెట్ల పరిసరాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఇవి. నిబంధనలు ఉల్లంఘించి.. అర్ధరాత్రి వేళ.. నాలాల్లోకి నేరుగా వ్యర్థ రసాయనాలు వదులుతుండటంతో అక్కడి నివాసితులు నరకం అనుభవిస్తున్నారు.
జీడిమెట్ల ప్రాంతంలోని నాలాలో సుమారు 50 ఎంఎల్డీల పారిశ్రామిక వ్యర్థాలు పారుతున్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ కలుషిత జలాలు కొన్ని ప్రాంతాల మీదుగా కూకట్పల్లి నాలాలో కలుస్తున్నట్లు సమాచారం. కిందటేడాది వర్షాకాలంలో వరదలు ముంచెత్తినప్పుడు ఆయా నాలాల్లోని నీరు కాలనీలను ముంచెత్తింది. అందులోని రసాయనాలు కూడా ఇండ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మళ్లీ వర్షాకాలం రావడంతో గత అనుభవాలను గుర్తు చేసుకొని వణికిపోతున్నారు.
పరిశ్రమల నిర్వాహకులు తమ కంపెనీల్లో ఉత్పత్తి అయిన వ్యర్థ రసాయన జలాలను జీఈటీఎల్ (జీడిమెట్ల వ్యర్థ రసాయనాల శుద్ధి కేంద్రం)కు లేదా కామన్ ఎంఫ్లూయంట్ ట్రీట్మెంట్ ప్లాంట్కు తరలించాలి. కానీ..డబ్బులు ఆదా చేసుకునేందుకు కొన్ని పరిశ్రమల యాజమాన్యాలు స్థానికంగా ముఠాలను ఏర్పాటు చేసుకొని.. రాత్రి సమయాల్లో వ్యర్థ రసాయనాలను ట్యాంకర్ల ద్వారా నాలాల్లోకి వదులుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు ఆయా ముఠాలకు రూ. 50వేల వరకు ఇస్తున్నట్లు సమాచారం. పీసీబీకి ఫిర్యాదులు అందినా.. పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.
గతంలో వ్యర్థ రసాయనాలను నాలాల్లో వదిలినందుకు సైమన్ ల్యాబరేటరీస్ ప్రైవేటు లిమిటెడ్, అతులిత కెమికల్ కంపెనీ, శ్రీపతి ఫార్మా పరిశ్రమ, విజయ శ్రీ కెమికల్స్ పరిశ్రమలను పీసీబీ అధికారులు సీజ్ చేశారు. అయినా కెమికల్ మాఫియా ఆగడాలు ఆగడం లేదు. కాగా, బల్క్ డ్రగ్, ఫార్మా పరిశ్రమల నుంచి ఉత్పత్తి అయ్యో వ్యర్థ రసాయనాలు హై – టీడీఎస్ (అత్యధిక గాఢత)ను కలిగి ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. క్లోరైడ్స్ సమ్మేళనం కలిపిన 20వేల లీటర్ల వ్యర్థ జలాలను నేరుగా నీటిలో కలిపితే జలచరాలు ముఖ్యంగా చేపలు, కప్పలు వెంటనే చనిపోయో అవకాశం ఉంటుందన్నారు.