సిటీబ్యూరో, జూలై 16 (నమస్తే తెలంగాణ): ఓటుకు నోటు కేసులో సాక్షుల విచారణ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇప్పటికే పది మంది కీలక సాక్షుల వాంగ్మూలాల నమోదు ప్రక్రియ పూర్తి కాగా, ఈనెల 26 నుంచి ఆగస్టు 13 వరకు 33 మంది సాక్షుల విచారణ చేపట్టేలా అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయ స్థానం షెడ్యూల్ రూపొందించింది. కేసులో సుమారు 50మందికి పైగా సాక్షులు ఉన్నందున వేగంగా విచారణ ప్రక్రియ పూర్తి చేయాలని అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్రావు కోరారు.
వారంలో రెండు రోజులు మాత్రమే విచారణ జరపాలని, రోజూ విచారణ చేపట్టడం వల్ల న్యాయవాదులు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని రేవంత్రెడ్డి తరఫు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. పాక్షికంగానే ప్రత్యక్ష విచారణలు చేపట్టాలని హైకోర్టు పేర్కొన్నందున వారానికి ఒకసారే సాక్షుల విచారణ చేపట్టాలని సెబాస్టియన్ తరఫు న్యాయవాది కోరారు. కొవిడ్ బారిన పడిన ఉదయ్సింహ కోలుకుంటున్నారని, రోజూ సాక్షుల విచారణ వల్ల ఇబ్బంది పడుతున్నారని ఆయన తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఈ కేసులో ప్రజా ప్రతినిధులపై అభియోగాలు ఉన్నందున సుప్రీం కోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు వేగంగా విచారణ జరుపాల్సిన అవసరం ఉన్నదని అవినీతి నిరోధక శాఖ కోర్టు అభిప్రాయపడింది.
పాక్షిక ప్రత్యక్ష విచారణల్లో ఐదేండ్లకు పైగా పెండింగ్లో ఉన్న కేసులకు ప్రాధాన్యం ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసినట్లు గుర్తు చేశారు. సాక్షుల విచారణ షెడ్యూలు రూపొందించి న్యాయవాదులకు ఇవ్వాలని గత నెలలో ఉన్నత న్యాయస్థానం ఆదేశించిందని తెలిపింది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఈనెల 26 నుంచి ఆగస్టు 13 వరకు 33 మంది సాక్షులను విచారించనున్నట్లు పేర్కొంది. ఆగస్టు 14 నుంచి 30 వరకు సెలవుల్లో వెళ్లనున్నందున మిగతా సాక్షుల విచారణ సెప్టెంబర్ 1 నుంచి చేపట్టనున్నట్లు అవినీతి నిరోధక శాఖ కోర్టు న్యాయమూర్తి వెల్లడించారు.