హైదరాబాద్: దిల్-సే(డిజిటల్ లిట్రెసీ టూ సెక్యుర్ యూత్) వలంటీర్లకు శనివారం గచ్చిబౌలి పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ధ్రువపత్రాలను అందజేశారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యురిటీ కౌన్సిల్, సైబరాబద్ పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక శిక్షణ ఇప్పించి సైబర్ నేరాలను అరికట్టేందుకు వీరిని నిష్ణాతులుగా తీర్చిదిద్దారు. వలంటీర్లు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని పాఠశాలలు, కాలేజీల్లో 8 నుంచి 12వ తరగతి విద్యార్థులకు అవగాహనను కల్పిస్తారు.
ఈ విధంగా సైబర్ నేరాల పై అవగాహన కల్పించి నియంత్రించడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా సోషల్ మీడియా, ఆన్లైన్ యాప్స్, గేమ్స్, ఫేక్ లింక్స్, స్మార్ట్ ఫోన్ వ్యసనం ఇలాంటి వాటితో సైబర్ నేరాలు, అనర్థాలకు దారి తీస్తుందనే అంశాలపై అవగాహనను కల్పిస్తారని పోలీసులు, ఎస్సీఎస్సీ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో ఇంటలిజెన్స్ ఐజీ రాజేశ్కుమార్, ట్రాఫిక్ డీసీపీ విజయ్కుమార్, కైమ్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, ఎస్సీఎస్సీ ప్రధాన కార్యదర్శి కృష్ణ ఏదుల, ప్రతినిధులు పాల్గొన్నారు.