కరోనా మహమ్మారిని అంతం చేయడానికి పౌర సమాజం పాత్ర ముఖ్యమని వీఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ నవీన్ వల్లభ్ పేర్కొన్నారు. బషీర్బాగ్లో కొవిడ్ నివారణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రచార వాహనాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ ఆరోగ్య రక్షణే ఉత్తమమైన మార్గమని ప్రజలకు తెలిపేందుకు ఈ ప్రచార వాహనాన్ని రూపొందించామని తెలిపారు. ప్రచార వాహనానికి అమర్చిన లౌడ్ స్పీకర్ల ద్వారా కరోనా వైరస్ నియంత్రణ చర్యలు, ప్రజారోగ్య సందేశాలను వినిపిస్తామన్నారు. ట్రస్ట్ సభ్యులు ప్రేరణ బృందాలుగా ఏర్పడి ప్రజలకు కొవిడ్ సూచనలు, సలహాలు ఇస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో తిరుగుతూ ప్రజలకు కొవిడ్ మహమ్మారి ముప్పు, ఆరోగ్య సంరక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత రక్షణ పరికరాలు, గ్లౌజ్, మాస్కులు ధరించడం, రెస్పిరేటర్లు, ఫేస్ షీల్డ్లను ధరించడం గురించి, వ్యాక్సినేషన్పై ప్రజలలో అవగాహన కల్పిస్తామని వివరించారు.