కరోనా వైరస్తో ప్రజల్లో మందుల వాడకం అమాంతం పెరిగింది. ముందుజాగ్రత్తలో భాగంగా చాలా మంది ముందస్తుగా మందులను, విటమిన్ మాత్రలను వినియోగిస్తున్నారు. గత సంవత్సరం మార్చి తరువాత ఈ మందులకు భారీ డిమాండ్ పెరిగింది. ఒకానొక సందర్భంలో మెడికల్ షాపుల్లో ఈ మందుల కొరత కూడా ఏర్పడింది. ప్రస్తుతం కరోనా వైరస్ రెండవ దశ కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి అవే పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని రకాల మందులకు కొరత ఏర్పడగా మరికొన్ని మందులకు డిమాండ్ రిత్యా తయారీ కంపెనీలు ఏకంగా ధరలను రెట్టింపు చేసినట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా వైరస్ బాధితులకు ‘సి’, ‘డి’, బి-కాంప్లెక్స్, జింక్ వంటి విటమిన్లను చికిత్సలో భాగంగా అందిస్తారు. దీన్ని గమనించిన ప్రజలు ముందుజాగ్రత్త చర్యగా విటమిన్ మాత్రలను వినియోగిస్తున్నారు. దీంతో ఈ విటమిన్ మాత్రలకు డిమాండ్ పెరిగింది. కొన్ని చోట్ల మెడికల్ షాపుల్లో విటమిన్ మాత్రలతో పాటు డోలో-650, పారసిటమల్, అజిత్రోమైసిన్ తదితర మందుల కొరత ఏర్పడినట్లు ప్రజలు తెలుపుతున్నారు.
కొన్ని రకాల మందుల ధరలు కరోనా కారణంగా రెట్టింపయ్యాయి. ముఖ్యంగా విటమిన్ మాత్రల ధరలు పెరిగినట్లు తెలుస్తుంది. ఉదాహరణకు బయోఫోలెట్ 10మాత్రలు రూ.60ఉండగా, ప్రస్తుతం దాని ధర రూ.157కు పెరిగింది. ఇలా పలు రకాల విటమిన్ మాత్రల ధరలు కూడా రెట్టింపైనట్లు ఫార్మసీల నిర్వాహకులు చెబుతున్నారు. ముడిసరుకు, కరోనాతో సిబ్బంది కొరత, పెరిగిన డిమాండ్ మేరకు ధరలు పెరుగుతున్నట్లు మెడికల్షాపుల నిర్వాహకులు పేర్కొంటున్నారు.
కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ విరుగుడుకు వినియోగించే రెమిడెసివిర్ ఇంజక్షన్కు డిమాండ్ అధికమవ్వడంతో ఇంజక్షన్ కొరత ఏర్పడింది. రోజురోజుకు కరోనా రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో ఈ ఇంజక్షన్ వినియోగం పెరిగింది. ఫలితంగా మార్కెట్లో ఏ మెడికల్ షాపులో కూడా రెమిడెసివిర్ స్టాక్ లేదు. అయితే కేవలం చికిత్సా కేంద్రాల్లో మాత్రమే ఈ ఇంజక్షన్లను అందుబాటులో ఉంచినప్పటికీ కొన్ని ఫార్మసీలలో రెమిడెసివిర్ లభించేది. కాని ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానలు మినహా చాలా ప్రైవేటు దవాఖానల్లో సైతం రెమిడెసివిర్ ఇంజక్షన్ కొరత నెలకొన్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు.
కరోనా చికిత్స అనుమతి ఉన్న దవాఖానల్లో మాత్రమే రెమిడెసివిర్ ఇంజక్షన్లను అందుబాటులో ఉంచేందుకు అనుమతిస్తారు. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా రెమిడెసివిర్ కొరత ఏర్పడుతున్నది. ఈ ఇంజక్షన్లు బయటి ఫార్మసీలలో విక్రయించేందుకు అనుమతి లేదు. ఇప్పటికే రెమిడెసివిర్ ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే బయటి దేశాలకు ఎగుమతిని కూడా నిలిపివేసింది. ఇకపోతే విటమిన్ మాత్రలు, ఇతర ఔషధాల విషయానికి వస్తే కరోనా నేపథ్యంలో జింక్, సి, డి, బి, మల్టీవిటమిన్ మాత్రలకు డిమాండ్ పెరిగింది. ఇటీవల కొన్ని మందుల దుకాణాలపై పోలీసులు దాడులు జరిపి అధిక ధరలతో కూడిన ఎమ్మార్పీ ముద్రలు వేస్తున్న ముఠాను పట్టుకున్న విషయం తెలిసిందే. ఇలాంటి వాటిపై డ్రగ్ కంట్రోల్ నిఘా పెడితే మంచిది.
కరోనా వచ్చినప్పటి నుంచి చాలా మంది సొంత వైద్యానికి అలవాటుపడ్డారు. ఎవరికి వారు ఫార్మసీకి వెళ్లి మాత్రలు తెచ్చుకుని వేసుకుంటున్నారు. ఇది ప్రమాదకరం. విటమిన్ మాత్రలు కూడా ఎలాపడితే అలా వాడకూడదు. వైద్యుల సలహా మేరకే వాడాలి. లోపం ఉన్నవారే విటమిన్ మాత్రలు వాడాలి. విటమిన్ మాత్రల వల్ల శరీరంలో విటమిన్స్ ఇన్బ్యాలెన్స్ అయితే ఇతర అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.