అక్రమాలకు చెక్ పెట్టేందుకు సర్కారు నిర్ణయం
నాణ్యత నిర్వహణ బాధ్యత ఉద్యానవన శాఖకు అప్పగింత
అనుమతి లేని వాటిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధం
నిర్వాహకులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు
రైతన్నల ప్రయోజనం కోసమే నిర్ణయం
నిర్మల్ టౌన్, జూలై 8: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎలాం టి అనుమతి లేకుండా నిర్వహిస్తున్న నర్సరీలకు చెక్ పెట్టేందుకు ఉద్యానవనశాఖ సిద్ధమవుతున్నది. రైతుల ప్రయోజనాలే ము ఖ్యంగా నర్సరీలో పెంచిన మొక్కల్లో నాణ్యతను తనిఖీచేసి, విక్రయించాల్సిన బాధ్యతను జిల్లా ఉద్యానవన శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐదారేండ్ల నుంచి తెలంగాణ ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహం అందించడం, ఉద్యానవనశాఖ కూరగాయల పెంపకానికి ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రైవేట్ నర్సరీలు ఏర్పడుతున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఐదేండ్ల కాలంలోనే నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో సుమారు వందకు పైగా ప్రైవేట్ కూరగాయల నర్సరీలు, మొక్కల నర్సరీలు 500కు పైగానే ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వారు ఎలాంటి అనుమతి లేకుండా నర్సరీలు నిర్వహిస్తూ అందులో పెంచిన కూరగాయల మొక్కలతో పాటు పండ్ల, పూల మొక్కలు విక్రయిస్తూ పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నారు. ఇక నుంచి ఎక్కడ దీనికి సంబంధించిన నర్సరీలున్నా ఉద్యానవనశాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంది. ఇందుకోసం రూ.2,500 ప్రభుత్వ చలానా చెల్లించాలి. అలాంటి వారికే నర్సరీలో విక్రయాలకు అనుమతి ఇస్తారు. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలోని నిర్మల్, మంజులాపూర్, చిట్యాల్, భైంసా, ఖానాపూర్, ముథోల్, ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, బేల, గుడిహత్నూర్, మావల, మంచిర్యాల జిల్లాలోని ఇందారం, బెల్లంపల్లి, చెన్నూర్, శ్రీరాంపూర్, ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్నగర్ తదితర ప్రాంతాల్లో కూరగాయల నర్సరీలతో పాటు పూల మొక్కల నర్సరీలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ లక్షలాది రూపాయల వ్యాపారం చేస్తున్నారు.
నర్సరీల నిర్వహణపై పెరగనున్న నిఘా..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రైవేట్ నర్సరీల ద్వారా పూలు, పండ్లు, కూరగాయల మొక్కలు పెద్ద ఎత్తున విక్రయాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటి నిర్వహణపై ప్రభుత్వం మరింత నిఘా పెంచుతున్నది. ఇక నుంచి ఏ గ్రామంలో కొత్త నర్సరీ ఏర్పాటు చేయాలనుకున్నా తప్పనిసరిగా ప్రభుత్వం ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించాలి. ఆ నర్సరీలో ఏ ఏ మొక్కలు లభిస్తాయి? ఎంత విస్తీర్ణంలో మొక్కలు పెంచుతారు? అన్న పూర్తి వివరాలు ఉద్యనవనశాఖ అధికారులకు తెలుపాల్సి ఉంటుంది. నర్సరీలో పెంచిన మొక్కల రకాలు, లాట్ నంబర్, మొక్క ఎదుగుదల సమయం, నారు నాణ్యత, ఎరువుల వినియోగం తదితర వివరాలను రికార్డులో రాసుకోవాలి. ఆయా గ్రామాల్లో ఉన్న నర్సరీల యజమానుల పేర్లు, వారి ఫోన్ నంబర్, ఆధార్కార్డు, పెంచుతున్న మొక్కల వివరాలు ఉద్యానవశాఖ అధికారులు తమ రికార్డులో భద్రపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నర్సరీలో కూరగాయల మొక్కలు రూపాయికే విక్రయిస్తుండగా.. పండ్ల, పూలు, ఇతర మొక్కలు రూ.5 నుంచి రూ. 500 వరకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో మొక్కల నాణ్యతపై కూడా ఉద్యానవనశాఖ అధికారులు పరిశీలించి అనుమతినిస్తారు. ఇందుకు సంబంధించిన రసీదును మొక్కలు కొనుగోలు చేసిన రైతుకు అందించాలని ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఉద్యానవనంలో పెంచిన మొక్కలు వినియోగదారులు తీసుకెళ్లి తన పంట చేనులో, ఖాళీ ప్రదేశంలో గాని నాటితే పెరగని సమయంలో నర్సరీపై ఫిర్యాదు చేసేందుకు ఉద్యానవనశాఖకు అవకాశం కల్పించారు. దీంతో ఇక నుంచి మొక్కల నిర్వహణ సమర్థవంతంగా ఉంటుందని ఉద్యానవనశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే జిల్లా ఉద్యానవనశాఖ అధికారులు ఆయా గ్రామాల్లో ఉన్న నర్సరీలకు ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు వివరిస్తూ అవగాహన కల్పించారు. మొక్కల విక్రయంలో పారదర్శకత, నాణ్యత ఉండేటట్లు చూడాలని కోరుతున్నారు. దీంతో మొక్కలు కొన్న రైతులకు ప్రయోజనం లభించనుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.