మాదాపూర్ : ఈ నెల 25న జరగనున్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశ ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే ఇతర ప్రజా ప్రతి నిధులు పరిశీలించారు. ప్లీనరీ సమావేశాలను దృష్టిలో ఉంచుకొని సమావేశానికి హజరుకానున్న ప్రతినిధులకు ఎటు వంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విధాల తగిన ఏర్పాట్లు చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక శాఖమంత్రి కేటీ రామారావు ఆయా శాఖలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులకు బాధ్యతలను అప్పగించారు.
ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ వి. జగదీశ్వర్గౌడ్లతో కలిసి ఆదివారం రాత్రి ప్లీనరీకి చెందిన పార్కింగ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, విప్ గాంధీ మాట్లాడుతూ ప్లీనరీకి హజరు కానున్న ప్రతినిధులు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. దూర ప్రాంతాల నుండి వాహనాలు రానుండడంతో పార్కింగ్ స్థలాల వద్ద పక్కా ప్రణాళికలతో ఏర్పాట్లు చేయాలన్నారు.
నిర్ణీత కాలానికి ముందే ఏర్పాట్లన్ని పూర్తి కావాలని ఆదేశించారు. పార్కింగ్ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో పాటు పోలీస్ సిబ్బందికి తగు సూచనలు చేశారు. ప్లీనరీ సమావేశానికి హజరయ్యే ప్రతినిధులు ట్రాఫిక్లో ఎటువంటి ఇబ్బందు లు తలెత్తకుండా, వాహనాలను నిలిపేందుకు పార్కింగ్ సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకొని సభను విజయ వంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఎరగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు గౌస్, ఖాజా, లోకేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు