హైదరాబాద్, నమస్తే తెలంగాణ / ఆర్కేపురం, మార్చి 4 : చారిత్రక విక్టోరియా మెమోరియల్ హోం అండ్ ఇండస్ట్రీయల్ స్కూల్ను అత్యుత్తమ బోధనా కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. గురువారం సరూర్నగర్లోని పాఠశాల ప్రాంగణంలో జరిగిన పాలక మండలి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విక్టోరియా మహారాణి స్మారకార్ధం అనాథ బాలబాలికల కోసం ఏర్పాటైన ఈ గురుకులాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. అయితే ఉపాధ్యాయులు, సిబ్బంది సేవాభావంతో విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించాలని సూచించారు.
విద్యతోపాటు పోటీ ప్రపంచాన్ని తట్టుకునేవిధంగా ఆంగ్ల భాషలో పట్టుసాధించేలా విద్యార్థులను సంసిద్ధం చేయాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య, శుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి విద్యార్థుల వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే విధంగా అందరూ సమష్టి కృషి చేయాలని వివరించారు. ‘విక్టోరియా’లో చదివి పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు ప్రభుత్వ గురుకుల కళాశాలల్లో, ఇంటర్ పూర్తి చేసిన వారికి డిగ్రీ కళాశాలల్లో ఎంట్రన్స్ లేకుండానే ప్రవేశాలు కల్పిస్తామని వెల్లడించారు. అంతేకాకుండా ఆసక్తి ఉన్నవారికి వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తామన్నారు. పూర్వ విద్యార్థుల వివరాలు సేకరించి ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అంతకుముందు విద్యాలయ ప్రాంగణం అంతా కలియతిరిగి పలు సూచనలు చేశారు. అవసరం అనుకుంటే డైనింగ్ హాల్ను విస్తరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి విజయ్కుమార్, కమిషనర్ యోగితారాణా, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్రెడ్డి, ‘విక్టోరియా’ ప్రిన్సిపాల్ సుహాసి తదితరులు పాల్గొన్నారు.