శంషాబాద్, ఆగస్టు 1: భారతీయ యువతలో నైపుణ్యాలకు కొదవ లేదని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆదివారం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులోని జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్, చిన్మయ విద్యాలయాన్ని ఆయన సందర్శించారు. శిక్షణ పొందుతున్న మహిళలు, విద్యార్థులతో మాట్లాడారు. పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జీఎంఆర్ గ్రూపు సంస్థల అధినేత జీఎం రావుతో పాటు ఇతర సీనియర్ అధికారులు ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ సామాజిక, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో జీఎంఆర్ చేస్తున్న కృషిని అభినందించారు. ఉన్న వనరులను వినియోగించుకుంటూ యువత నైపుణ్యాలు పెంచుకోవాలన్నారు. స్వయం కృషితో ఉపాధి, ఉద్యోగాలు సాధించి ఆర్థిక, సామాజిక, స్వయం సమృద్ధి, సాధికారతకు మార్గదర్శకులు కావాలని ఉద్ఘాటించారు.