శంషాబాద్, జూలై 16: ప్రకృతి పరిరక్షణ ప్రజా ఉద్యమంగా రూపు దాల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ పరిధిలోని హైదరాబాద్ స్వర్ణ భారత్ ట్రస్టు చార్టర్ను సందర్శించి, ట్రస్టులో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో చర్చాగోష్టి జరిపిన వెంకయ్యనాయుడు ట్రస్టు విభాగాలను పరిశీలించారు. అనంతరం, మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవ భారత నిర్మాణంలో స్వర్ణ భారత్ ట్రస్టు ముందుకు సాగుతూ ఎందరో ప్రశంసలు అందుకుంటుందని తెలియజేశారు. గ్రామ పంచాయతీల నుంచి పార్లమెంట్ వరకు ప్రతి ఒక్కరు ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వ్యవస్థాపకులు జి.ఎన్.రావు, భావి చైర్మన్ డా॥ ప్రశాంత్ గర్గ్, ట్రస్టు అధ్యక్షుడు చిగురుపాటి కృష్ణ ప్రసాద్, కార్యదర్శి సుబ్బారెడ్డి, మల్లారెడ్డి విద్యా సంస్థల కోశాధికారి భద్రారెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.