కూకట్పల్లిలో ఓ వాహనదారుడు ఫోన్లో మాట్లాడుతూ ముందు వెళ్తున్న వాహనానికి కట్ కొట్టి ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. కుటుంబంతో వెళ్తున్న మరో వాహనదారుడు ఈ అకస్మాత్తు పరిణామానికి కన్ఫ్యూజ్ అయ్యాడు. తేరుకునే లోపు వాహనం అదుపు తప్పి కింద పడింది. భార్యాభర్తలకు తీవ్రగాయాలయ్యాయి. సీసీ కెమెరాల ఆధారంగా వాహనదారుడిని గుర్తించి అతడు చేసిన తప్పిదాన్ని సైబరాబాద్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లో చూపించారు. “నీవు చేసింది తప్పు. హెడ్ఫోన్స్ పెట్టుకొని ఫోన్ మాట్లాడుతూ ఇతర వాహనదారులను గమనించకుండా వాహనాన్ని నడిపావు. సడన్గా కట్ కొట్టడంతో ఆ దంపతులు పడిపోయారు” అని చెప్పడంతో ఆ వాహనదారుడు సారీ సార్ మరోసారి అలా డ్రైవ్ చేయనని క్షమాపణలు కోరాడు.
సుచిత్రా చౌరస్తాలో ఓ ఆటో డ్రైవర్ సిగ్నల్ పడగా ఆ ఆత్రంలో వేగం పెంచాడు. అప్పటికే మరోవైపు నుంచి వాహనాలు రాగా వెళ్లి గుద్దాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దృశ్యాన్ని చూపిన పోలీసులు ఆటో డ్రైవర్ నుంచి వివరణ అడగ్గా.. సిగ్నల్ పడుతుందనే తొందరలో అలా చేశానని.. మరోసారి అలా చేయనని వేడుకున్నాడు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): వాహన వేగాన్ని ఎక్కడ తగ్గించాలో.. ఎక్కడ పెంచాలో తెల్వకపోవడంతో ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనదారులు రోడ్లపై ఓవర్ స్పీడ్తో ప్రయాణిస్తూ ఇతరులను ప్రమాదంలోకి నెడుతున్నాడు. ఓవర్ స్పీడ్తో రావడం.. కట్లు కొడుతూ ఓవర్టేక్ చేస్తుండటంతో మిగిలిన వాహనదారులు అయోమయం చెందుతున్నారు. తీవ్ర గందరగోళానికి గురై ప్రమాదాల బారిన పడుతున్నారు.
వాహనదారులకు నిబంధనలపై అవగాహన లేకపోవడం.. అవగాహన ఉన్న వారు వాటిని పాటించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని.. ఇందులో 95 శాతం మానవ తప్పిదాలుండగా.. ఐదు శాతం రోడ్డు సదుపాయాలు సరిగా లేని కారణంగా యాక్సిడెంట్లు అవుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. దీంతో వాహనదారుల్లో మార్పు తీసుకువచ్చేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇందులో సైబరాబాద్ పరిధిలో జరిగిన ప్రమాదాలు.. వాటికి గల కారణాలతో కూడిన వీడియోలను ప్రదర్శిస్తున్నారు. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు దాదాపు 1200 మందికి ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎమ్ విజయ్కుమార్ సారథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఇన్స్పెక్టర్ భాస్కర్
నిర్వహిస్తున్నారు.
ప్రమాదాలు చేసిన వారు.. ఇందులో బాధితులైన దాదాపు 1200 మందికి పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చేసిన తప్పిదాలను స్క్రీన్పై ప్రత్యక్షంగా చూపుతూ కౌన్సెలింగ్ ఇస్తున్నారు. హెల్మెట్ లేకుండా, మొబైల్, హెడ్ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుతూ 800 మంది వాహనాలు నడిపి యాక్సిడెంట్స్ చేసిన వారిపై పోలీసులు దృష్టి పెట్టారు. మరో 400 మంది చేసిన తప్పులను గుర్తించి వారి సమాచారాన్ని భద్రపరిచారు. వీరు మరోసారి ఏదైనా ప్రమాదం చేసినా.. నిబంధనలు పాటించకుండా వాహనం నడిపినా వెంటనే గుర్తించి కౌన్సెలింగ్కు రప్పిస్తున్నారు. ఇలా చేయడంతో దాదాపు 70 శాతం మంది వాహనదారుల్లో మార్పు వచ్చిందని పోలీసులు వివరిస్తున్నారు.