ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ మోడల్ స్కూల్ను ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పాఠశాలలో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులను చేర్పించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కరోనా నేపథ్యంలో ఎంతో మంది తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, వారు తమ పిల్లలను ఓయూ మోడల్ స్కూల్లో చేర్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. నామమాత్రపు ఫీజుతో అత్యుత్తమ విద్యను మోడల్ స్కూల్లో ఓయూ అందిస్తోందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడ చేర్పించడం ద్వారా మంచి విద్యను పొందవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రవేశాల గురించి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలని సూచించారు.
మోడల్ స్కూల్ను మరింత బలోపేతం చేసి, పూర్వవైభవం తెచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ పి. శంకర్, ప్రధానోపాధ్యాయురాలు జ్యోతిశ్రీ పాల్గొన్నారు.