రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ
ఉస్మానియాలోని పలు వార్డుల సందర్శన
సుల్తాన్బజార్, ఏప్రిల్ 17: కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఉస్మానియాకు వచ్చే పేద రోగులకు సత్వరమే వైద్య సేవలందించేందుకు అన్ని విభాగాల వైద్యులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ అన్నారు. శనివారం సాయంత్రం ఆమె ఉస్మానియా దవాఖానను సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యశాలకు విచ్చేసిన ఆమెకు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆమె దవాఖానాలోని ఓపీ బ్లాక్లోని క్యాజువాలిటీ, రెండవ అంతస్థులోని ప్లాస్టిక్ సర్జరీ విభాగాలను సందర్శించి అక్కడ రోగులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అన్ని విభాగాల వైద్యాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గాంధీని పూర్తిస్థాయి కొవిడ్ కేంద్రంగా మార్చిన నేపథ్యంలో ఉస్మానియాకు ఓపీ, ఐపీ రోగుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు.
అన్ని విభాగాల వైద్యాధికారులు సమన్వయంతో రోగులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ మాట్లాడుతూ దవాఖానాలోని ఓపీ, కులీకుతుబ్షా, హౌస్ సర్జన్ క్వార్టర్, క్యూక్యూ భవనంలోని నాల్గవ అంతస్థులోని ఎంఎం-1 వార్డులో చికిత్స పొందుతున్న రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. ఇతర ప్రాంతాల నుంచి రోగులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. క్యూక్యూ భవనంలోని నాల్గవ అంతస్థులో వార్డులు పూర్తి అయితే మరో 180 పడుకలు రోగులకు అందుబాటులోకి వస్తాయన్నారు. కార్యక్రమంలో సీఎస్ ఆర్ఎంవో-1 డాక్టర్ శేషాద్రి, డిప్యూటీ సీఎస్ ఆర్ఎంవోలు డాక్టర్ సాయిశోభ, డాక్టర్ శ్రీనివాసులు, ఆర్ఎంవోలు డాక్టర్ రఫీ, డాక్టర్ మాధవి, డాక్టర్ రాజ్కుమార్, వివిధ విభాగాల వైద్యాధికారులు డాక్టర్ నాగప్రసాద్, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ తిమ్మారెడ్డి, డాక్టర్ మనీషాసహాయ్, డాక్టర్ రమేష్ పాల్గొన్నారు.