అమీర్పేట్, బన్సీలాల్పేట్ :దేశంలో తొలిసారిగా రోడ్డు పక్కన ఉండే నిర్వాసితులు, ఆనాథలకు కరోనా వ్యాక్సిన్ను ఇచ్చారు. ఫుట్పాత్లపై భిక్షాటన చేస్తూ అనాథలుగా జీవనం సాగిస్తున్న వారికి ఆదివారం కోవిడ్ వ్యాక్సినేషన్ వేశారు. పద్మారావునగర్కు చెందిన స్కై ఫౌండేషన్ ప్రత్యేక శ్రద్ధతో జిల్లా వైద్య,ఆరోగ్య ఆధికారి డాక్టర్ జి.వెంకటి అనుమతితో వ్యాక్సిన్ వేశారు. ఎటువంటి ధృవీకరణ పత్రాలు లేని ఇటువంటి వారికి ప్రభుత్వం ప్రత్యేక కేటగిరి కింద పరిగణిస్తూ వ్యాక్సిన్ అందిస్తోంది.
లోయర్ ట్యాంక్బండ్ గోశాల ఫుట్పాత్లు, రాణిగంజ్ అంబేద్కర్నగర్ ఫుట్పాత్లపై నివాసాలు ఏర్పర్చుకున్న దాదాపు 40 మందికి నగరానికి చెందిన స్కై ఫౌండేషన్ ప్రతినిధుల చొరవతో ఆదివారం వ్యాక్సినేషన్ అందింది. అనాథలుగా గుర్తించిన వారి పేర్లు, ఫోటోలు సేకరించి వ్యాక్సిన్ అందిస్తున్నారు. సమాజంలో నిరాదరణకు గురవుతున్న ఇటువంటి వారిని గుర్తించి ప్రభుత్వం ద్వారా అందుతున్న వ్యాక్సిన్ను ఇప్పించేందుకు స్కై ఫౌండేషన్ వ్యవస్ధాపక అధ్యక్షులు వై.సంజీవ్కమార్ ముందుకు వచ్చారు. సంస్థ ప్రతినిధులు, వ్యాక్సినేషన్ సిబ్బందితో కలిసి లోయర్ ట్యాంక్బండ్ గోశాల, అంబేద్కర్నగర్ ఫుట్పాత్ పరిసరాలను సందర్శించి వారికి వ్యాక్సిన్ ఇప్పించారు.
ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు వై.సంజీవ్కుమార్ మాట్లాడుతూ ఇకపై సంస్థ ద్వారా అనాథలకు అన్నదానం, బట్టల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు జరిగే ఆదివారాల్లో వ్యాక్సినేషన్కు దూరమైన వారిని గుర్తించి వారికి వ్యాక్సినేషన్ జరిగేలా చొరవ తీసుకుంటామని తెలిపారు. చుట్టలబస్తి ఆరోగ్య కేంద్రం మెడికల్ అఫిసర్ డాక్టర్ శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో జరిగిన వ్యాక్సినేషన్ లో స్కై ఫౌండేషన్ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ వై.సంజీవ్ కుమార్, ఉపాధ్యక్షురాలు ఓ.పావనీ, నర్సులు భారతి, రమాదేవి, సుజాతలు పాల్గొన్నారు.