సిటీబ్యూరో, మే 29(నమస్తే తెలంగాణ)/మియాపూర్ , శేరిలింగంపల్లి/అబిడ్స్: సూపర్ స్ప్రెడర్స్కు కూపన్ల జారీలో నెలకొంటున్న అసంబద్ధతను తొలగించేందుకు ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. అనర్హులకు ఏ మాత్రం అవకాశం దక్కకుండా ఉండేందుకు కూపన్ల స్థానంలో యాప్ ద్వారా బుకింగ్ ప్రక్రియను చేపడుతున్నది. బల్దియాలోని శేరి లింగంపల్లి జోన్, ఖైరతాబాద్ జోన్లలో ఈ యాప్ ఆధారిత బుకింగ్ను ‘పైలట్ ప్రాజెక్టు’గా చేపడుతున్నది. ఈ విధానం విజయవంతమైతే ఒకటి రెండు రోజులలో నగరంలోని అన్ని సర్కిళ్లకు విస్తరించే యోచనలో ప్రభుత్వం ఉన్నది.
బల్దియా పరిధిలోని శేరిలింగంపల్లి సర్కిల్, జాంబాగ్ డివిజన్లను పైలట్ ప్రాజెక్టుగా గుర్తిస్తూ ప్రభుత్వం తాజాగా శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ప్రావీణ్య జాంబాగ్లో, శేరిలింగంపల్లి కమిషనర్ నాగళ్ల రవికిరణ్ తమ బృందాలతో క్షేత్ర స్థాయిలో బుకింగులను ప్రారంభించారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ 450 మంది లబ్ధిదారులను గుర్తించి యాప్లో నమోదు చేశారు. తద్వారా వారందరికీ సంక్షిప్త సందేశం రాగా.. ఆదివారం ప్రత్యేక కేంద్రంలో లబ్ధిదారులకు వ్యాక్సిన్ వేయనున్నారు.
వ్యాక్సిన్ వేయించుకునే లబ్ధిదారులు తమ వెంట మొబైల్తో పాటు ఆధార్ కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. వాస్తవానికి కూపన్లు రోజువారీగా వెయ్యి ఇచ్చినప్పటికీ, యాప్ ద్వారా 450 మందిని మాత్రమే గుర్తించారు. అయితే ఈ నమోదును మరింత పెంచుతామని అధికారులు పేర్కొంటున్నారు. జాంబాగ్ డివిజన్ పరిధిలోని మొజాంజాహి మార్కెట్, పూలమార్కెట్లలోని వ్యాపారుల వివరాలులను అధికారులు నమోదు చేశారు. అనంతరం వారికి వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా రెండో రోజైన శనివారం 22,399 మందికి టీకాలు వేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో శుక్రవారం ప్రారంభమైన మొదటి రోజు 21,666 మందికి వ్యాక్సిన్ అందించారు. నిత్య సేవకులుగా గుర్తించిన తొమ్మిది రంగాలకు చెందిన వారికి పది రోజుల పాటు 30 సర్కిళ్లలోని 31 కేంద్రాల ద్వారా వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ముందుగానే గుర్తించిన వారికి ప్రత్యేక టోకెన్లను అందజేసి వారికి ఇచ్చే వ్యాక్సినేషన్ సమయాన్ని కూడా ప్రత్యేకంగా పేర్కొనడంతో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా కొవిడ్ నిబంధనలతో సజావుగా సాగింది. కాగా, నగరంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పలువురు ప్రజాప్రతినిధులు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ పలు కేంద్రాలను సందర్శించి పరిశీలించారు. ఎవరు పడితే వారు వ్యాక్సినేషన్ కేంద్రాల వద్దకు వచ్చి ఇబ్బందులకు గురి కావొద్దని సూచించారు. టోకెన్లు కలిగిన వారికి మాత్రమే వ్యాక్సినేషన్ కేంద్రంలోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. కాగా, వ్యాక్సినేషన్ ప్రక్రియలో 18 నుంచి 44 ఏళ్ల వారు 17,470 మంది ఉండగా, 45 ఏళ్లు దాటిన వారు 4,929 మంది ఉన్నారు.