అబిడ్స్, సుల్తాన్బజార్, ఏప్రిల్ 28 : వ్యాక్సినేషన్ ద్వారానే కరోనా కట్టడి చేయవచ్చని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మే ఒకటి నుంచి 18 సంవత్సరాలు నిండిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ వేసేందుకు అనుమతి ఇవ్వడంతో కరోనా వ్యాక్సినేషన్ను వేగవంతం చేసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్ కేంద్రాలతో పాటు అదనపు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు చొరవ చూపుతున్నారు. మొదట ఫ్రంట్ వారియర్స్కు వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని చేపట్టింది. అనంతరం కరోనా కట్టడి కోసం ఆరవై సంవత్సరాలకు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని ప్రారంభించగా మొదట్లో వ్యాక్సిన్పై అవగాహన లేక వ్యాక్సిన్ వేసుకునేందుకు అత్యధికులు సుముఖత చూపలేదు. దీంతో ప్రభుత్వం మరోసారి 45 సంవత్సరాలకు పై బడిన వారందరూ వ్యాక్సిన్ వేసుకునేందుకు అర్హులని ప్రకటించి వ్యాక్సిన్ వేస్తుంది.
ఇదిలా ఉండగా రోజు రోజుకూ కరోనా తీవ్రత పెరగడంతో ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం 18 ఏండ్లకు పైబడిన వారంతా మే ఒకటి నుంచి వ్యాక్సిన్ వేసుకోవచ్చని, అయితే ఆన్లైన్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ప్రకటించింది. ప్రభుత్వం చేసిన ప్రకటనతో యువత వ్యాక్సినేషన్ వేసుకునేందుకు ముందుకు వచ్చి ఆన్లైన్లో తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేసి రెండు నెలల్లో పూర్తి చేయించే ఆలోచనలో ఉంది. దీంతో గోషామహల్ నియోజకవర్గంలో వ్యాక్సినేషన్ కా ర్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు గానూ అవసరమైతే అదనంగా వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. అదనపు వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన సిబ్బంది నియామకం తదితర విషయాలమై అధికారులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం కింగ్కోఠి క్లస్టర్ పరిధిలో నిత్యం 2500 మంది వరకు వ్యాక్సిన్ వేసుకుంటున్నారు. మే ఒకటవ తేదీ తరువాత ప్రతి నిత్యం ఆరు వేల నుంచి ఏడు వేల మందికి వ్యాక్సిన్ వేసే అవకాశం ఉంది.