పచ్చదనం పెంపులో జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ ప్రత్యేకతను చాటుకుంటున్నది. గతానికి భిన్నంగా ఏడో విడుత హరితహారంలో మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్కు శ్రీకారం చుట్టింది. గ్రేటర్లోని ప్రధాన రహదారుల వెంట 4 నుంచి 8 వరుసల్లో మొక్కలు నాటుతుండగా ప్రత్యేకార్షణగా నిలుస్తున్నాయి. ఆరాంఘర్ వద్ద నాటిన మల్టీలేయర్ అవెన్యూ ప్లాంటేషన్(ఎంఎల్ఏపీ)పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. మరిన్ని రహదారుల వెంట ఈ విధానంలో మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. దీంతో మియాపూర్ బస్ డిపో, బీకే ఎన్క్లేవ్, రాందేవ్ గూడ- నెక్నాంపూర్ రోడ్డు, మల్కాజిగిరి సర్కిల్లోని జెడ్టీసీ నుంచి ఎన్ఎఫ్సీ వరకు ఈ ప్లాంటేషన్ పనులను అధికారులు ముమ్మరం చేశారు. – సిటీబ్యూరో, జూలై 19 (నమస్తే తెలంగాణ)
ఆరాంఘర్ చౌరస్తా నుంచి శంషాబాద్ వైపు వెళ్లే మార్గంలో అధికారులు తొలుత 400 మీటర్ల మేర మల్టీలేయర్ అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టారు. అందం, ఆహ్లాదం, వాహనదారులను ఆకట్టుకుంటుండటంతో మరో మూడు కిలోమీటర్ల మేరకు ప్లాంటేషన్కు శ్రీకారం చుట్టారు. హెడ్జ్, ట్రీ, స్క్రబ్స్ ఇలా మూడు పద్ధతుల్లో మొక్కలు నాటుతున్నారు. ఒక లేయర్లో 4 నుంచి 8 వరుసల్లో నాటుతున్న మొక్కలు ప్రత్యేకాకర్షణగా నిలుస్తున్నాయి. మల్టీలేయర్ అవెన్యూ ప్లాంటేషన్గా వ్యవహరించే ఈ విధానంలో రహదారులకు ఇరువైపులా అధిక విస్తీర్ణంలో ఉన్న స్థలంలో మొదటి వరుసలో పొదల పూల మొక్కలు, రెండో వరుసలో ఒక ఫీట్ వరకు పెరిగే పొగడ, బిజ్జోనియా మెగాఫోటమికా జాతి మొక్కలు, చివరి వరుసలో ఏపుగా పెరిగి నీడనిచ్చే వేప, రావి, మర్రి ఇతర చెట్లను పెంచుతున్నారు. ఈ విధానంలో మూడు వరుసల్లోని మొక్కలు ప్రయాణికులకు కనువిందు చేస్తున్నారు.
ఏడో విడత హరితహారంలో భాగంగా కోటి మొక్కలు నాటాలన్న లక్ష్యంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ నిర్దేశిత టార్గెట్ను చేరేలా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, కూకట్పల్లి జోన్ల పరిధిలోని 600 నర్సరీల్లో కోటి మొక్కలను అధికారులు సిద్ధం చేశారు. జోన్ల వారీగా ఖాళీ స్థలాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 10 లక్షల మొక్కలు నాటినట్లు జీహెచ్ఎంసీ అర్బన్ బయో డైవర్సిటీ విభాగం అధికారులు తెలిపారు.