న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: కరోనా తొలి విడుతలో మహమ్మారికి సమర్థంగా అడ్డుకట్టవేసి ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచిన భారత్.. ప్రస్తుతం రెండో విడుత ఉద్ధృతితో విలవిల్లాడుతున్నది. రికార్డుస్థాయిలో కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. దవాఖానలు కిటకిటలాడుతున్నాయి. ఆక్సిజన్, ప్రాణాధార ఔషధాల కొరతతో రోగులు అల్లాడుతున్నారు. పలుచోట్ల శవాగారాలు, స్మశానాలు ఖాళీ లేని దయనీయ దుస్థితి. మొత్తంగా దేశంలో ‘హెల్త్ ఎమర్జెన్సీ’ పరిస్థితులు నెలకొన్నాయి. ఇతర దేశాల్లో పరిస్థితులను బట్టి కరోనా సెకండ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని అర్థమైనా.. దానిని నివారించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిపుణులు పేర్కొంటున్నారు. వరుసగా రెండో ఏడాది లాక్డౌన్ విధిస్తే ఆర్థికంగా పెనుభారం తప్పదని, వ్యాక్సినేషన్ ద్వారానే మహమ్మారికి ముకుతాడు వేయొచ్చని తెలిసినా.. అందుకు తగిన ఏర్పాట్లు చేయలేదని విమర్శిస్తున్నారు. ప్రపంచ వ్యాక్సిన్ కేంద్రంగా మనదేశం ఖ్యాతి గడించినా.. ప్రజలందరికీ వ్యాక్సిన్ వేయడంలో మాత్రం వెనుకబడి ఉన్నదన్న కఠిన వాస్తవాన్ని గుర్తుచేస్తున్నారు.
దేశంలో మహమ్మారి ముగింపు దశకు వచ్చిందని ఈ ఏడాది మార్చి ప్రారంభంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. గతేడాది సెప్టెంబర్ మధ్య నాటికి దేశంలో సగటున రోజుకు 93,000 కేసులు నమోదుకాగా, ఈ ఏడాది మార్చి మధ్యనాటికి అవి 11వేలకు దిగివచ్చాయి. మరణాల సంఖ్య కూడా 100కు తగ్గిపోయింది. ఫిబ్రవరి మధ్యలో ఎన్నికల సంఘం ఐదు రాష్ర్టాల అసెంబ్లీలకు షెడ్యూల్ ప్రకటించింది. ఎలాంటి కరోనా నిబంధనలు పాటించకుండా వేలమందితో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మార్చి మధ్యలో గుజరాత్లోని మోతెరా స్టేడియంలో మ్యాచ్కు వేలమంది హాజరయ్యారు. హరిద్వార్ కుంభమేళాకు లక్షలాదిమంది పోటెత్తారు. చూస్తుండగానే దేశంలో పరిస్థితులు తలకిందులయ్యాయి.
ఆక్సిజన్, రెమ్డెసివిర్లకు కొరత..
దేశంలో మెడికల్ ఆక్సిజన్కు తీవ్ర కొరత ఏర్పడింది. మన దేశానికి 7 వేల మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నది. అయితే నిల్వ, పంపిణీకి తగినన్ని సిలిండర్స్, క్రయోజెనిక్ ట్యాంకర్స్ లేవు. కరోనా చికిత్సలో ఉపయోగించే రెమ్డిసివిర్ ఔషధానికి కూడా కొరత ఏర్పడింది. తెలంగాణలోనే టీకా ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ, రెమ్డిసివిర్ కొరత నెలకొంది. ఈ విషయంలో కేంద్రం వివక్షను ప్రదర్శిస్తున్నది. ఆక్సిజన్, వ్యాక్సిన్ నిల్వలను గుజరాత్కు అధికంగా పంపిస్తున్నదనే ఆరోపణలు ఉన్నాయి.
వ్యాక్సిన్ ఉత్పత్తి, సరఫరాలో వైఫల్యం
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ (సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా-ఎస్ఐఐ) ఉన్న మనదేశంలో వ్యాక్సినేషన్ దారుణంగా ఉండడం నిర్ఘాంతపరిచే విషయం. విదేశాలకు టీకాలను ఎగుమతి చేస్తూ, కొన్ని దేశాలకు బహుమతిగా టీకాలను పంపుతూ కేంద్రం మొదట్లో గొప్పలకు పోయింది. మరోవైపు దేశీయ అవసరాల మేరకు ఉత్పత్తి జరుగలేదు. ఇటు ప్రజలకు, అటు విదేశాలకు సరఫరా చేయలేక రెంటికి చెడ్డ రేవడిలా పరిస్థితి తయారైంది. దేశంలో వ్యాక్సినేషన్ మొదలై నాలుగు నెలలైంది. ప్రధాన దేశాలతో పోలిస్తే ఇప్పటికీ భారత్ వెనుకబడి ఉన్నది. మరోవైపు, వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న భారతీయ కంపెనీలకు తగినంత ధర ఇవ్వలేదు. దీంతో టీకా ఉత్పత్తికి ఆర్థిక వనరుల కొరత ఏర్పడింది. అలాగే వ్యాక్సిన్ల ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాలు లభ్యమయ్యేలా చూడడంలోనూ కేంద్రం విఫలమైంది.
గంట గంటకు మృత్యుఘంటికలు
కరోనా సెకండ్ వేవ్ ధాటికి దేశం చిగురుటాకులా వణికిపోతున్నది. ఆదివారం నుంచి సగటున ప్రతి గంటకు 10వేలకు పైగా కేసులు, 60 మరణాలు నమోదవుతున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను బట్టి తెలుస్తున్నది. ఏప్రిల్ 1న దేశంలో 72 వేలకు పైగా కేసులు, 459 మరణాలు నమోదయ్యాయి. అంటే గంటకు సగటున 3,013 కేసులు, 19 మరణాలు నమోదయ్యాయి. అయితే, గత ఆదివారం నాటికి ఈ సంఖ్య మూడురెట్లకు పైగా పెరుగడం గమనార్హం.