కొండాపూర్, సెప్టెంబర్ 16: ఉపాధ్యాయులు తరగతిని దాటి సరికొత్త పాఠాలు నేర్చుకోవాలని, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఎప్పటికప్పుడు నైపుణ్యతలతో పాటు నైతికత, మంచి మనస్సు తో సహకారం అందించాలని ఇంగ్లిషు అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) రిటైర్డ్ ప్రొఫెసర్ వి.సుధాకర్ తెలిపారు. గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉపాధ్యాయుల శిక్షణ కోసం ‘ఇన్ -సర్వీస్’ ట్రైనింగ్ పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని వర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ బీజే రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు కేవలం తరగతి గదికే పరిమితమవ్వకుండా బయటి ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ, తమ స్కిల్స్ ని మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగాలన్నారు.
అనంతరం వర్సిటీ పూర్వ విద్యార్థులు అందజేసిన ట్యాబ్లు, మొబైల్ ఫోన్లను ఆన్లైన్ తరగతుల కు ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేశారు. ఉపాధ్యాయుల శిక్షణ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ (డీఈఈటీ) ఆధ్వర్యంలో వర్సిటీలోని స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ విభాగంలో 21 రోజుల పాటు సెప్టెంబర్ 14వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ వై సుధాకర్రెడ్డి, ప్రొఫెసర్లు భువనేశ్వర లక్ష్మీ, వీఎస్ నాగేశ్వరరావు, డాక్టర్లు గీత గోవింద, క్రిష్ణ, మురళి, సుమలిని, జలంధరాచారి, మధుసూదన్, పాల్గొన్నారు.