హిమాయత్నగర్కు చెందిన రాజ్కుమార్కు బ్లూడాట్ కొరియర్లో ఓ పార్సిల్ రావాల్సి ఉండగా అది సమయానికి రాలేదు. ఎందుకు రాలేదో తెలుసుకోవడానికి బ్లూడాట్ కొరియర్కు సంబంధించిన నంబర్ కోసం గూగుల్లో సెర్చ్ చేశాడు. అందులో లభించిన ఓ నంబర్కు ఫోన్ చేశాడు. అక్కడే పొరపాటు జరిగింది. ఈ లోపు.. తాము బ్లూడాట్ కస్టమర్ కేర్ ప్రతినిధులమంటూ మాట్లాడిన సైబర్నేరగాళ్లు బాధితుడితో ఎనీడెస్క్ యాప్ను డౌన్లోడ్ చేయించారు. మీ ఎస్బీఐ యూనో యాప్ను ఒక్కసారి మీ సెల్ఫోన్లో ఓపెన్ చేసిపెట్టండి, ఆ ఖాతాకు మేం డబ్బులు పంపిస్తామంటూ నమ్మించారు. బాధితుడు నిజమని నమ్మి ఎనీడెస్క్ ఓపెన్ చేస్తుండగానే యూజర్ ఐడీ, పాస్వర్డ్ను గుర్తించిన సైబర్నేరగాళ్లు అతడి ఖాతాలో ఉన్న రూ. 2.37 లక్షలు కాజేశారు. ఇలా నగరంలో అనేక మంది గూగుల్లో కస్టమర్ కేర్ నంబర్ల కోసం ప్రయత్నించి నకిలీ నంబర్లకు ఫోన్ చేసి మోసపోతున్నారు.
కొవిడ్ నేపథ్యంలో నగర ప్రజలు ఆన్లైన్ సౌకర్యాలపై ఆధారపడుతున్నారు. కానీ అదే సమయంలో తమకు అవసరమైన సమాచారం కోసం గూగుల్లో సెర్చ్ చేస్తూ.. సైబర్నేరగాళ్లు పెడుతున్న తప్పుడు నంబర్లకు ఫోన్ చేస్తున్నారు. ఆ తర్వాత వారు చెప్పినట్టల్లా విని డబ్బులు అప్పజెప్పి ఖాతాలు ఖాళీ చేసుకుంటున్నారు. తాజాగా ఆక్సిజన్, ఇంజక్షన్లు, ఇతరత్రా మందుల విషయంలో సైబర్ నేరగాళ్లు నకిలీ పోస్టులు పెడుతూ కొత్త తరహా మోసాలకు తెరలేపారు. ఇలాంటి విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సైబర్క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.
గూగుల్లో వెతికి సమాచారాన్ని తెలుసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. అసలు మనకు లభించిన సమాచారం సదరు సంస్థదేనా కాదా పరిశీలించుకోవాలి. ఎప్పుడైనా సరే.. డబ్బుల లావాదేవీల ప్రస్తావన వస్తే.. ఎవరు చెప్పినా సరే ఎటువంటి యాప్లనూ డౌన్లోడ్ చేయకండి. బ్యాంకు ఖాతా వివరాలు ఎవరికీ చెప్పకండి. వాటిని ఏ బ్యాంకూ అడగదు కూడా. అలాంటి సందర్భాల్లో మనం వెళ్లింది ఒక పని కోసమైతే.. వాళ్లు మనకు కొత్త పనిచెబుతున్నారనే చిన్న అనుమానం బాధితులకు రావాలి. కానీ గుడ్డిగా రిమోట్ యాప్స్ను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఇది అవగాహన లేకపోవడంతోనే జరుగుతున్నది. అవగాహన లేనివారు తెలిసిన వారిని అడగాలి. – కేవీఎం ప్రసాద్, ఏసీపీ సైబర్క్రైమ్స్