బేగంపేట్, జూలై 7: కరోనా నిబంధనలు పాటిస్తూ సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాలను వైభవంగా నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం ఉజ్జయినీ అమ్మవారి బోనాల ఏర్పాట్లపై దేవాలయ ఆవరణలో డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావుతో కలిసి జీహెచ్ఎంసీ, పోలీస్, జలమండలి, రెవెన్యూ, సాంస్కృతిక శాఖాధికారులు, సేవా సంఘాల ప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జాతర నిర్వహణకు ఇంకా సమయం ఉన్నందున రోడ్లు, తాగునీరు, విద్యుత్, శానిటైజేషన్ లాంటి ఏర్పాట్లు చేయాలని కోరారు.
ఉత్సవాలకు రెండు రోజుల ముందే దేవాలయ సమీప ప్రాంతాల్లో రాకపోకలను నిషేధించాలన్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు మాట్లాడుతూ తెలంగాణలోనే అతిపెద్ద జాతరగా ఉజ్జయినీ మహంకాళి ఉత్సవాలు పేరుగాంచాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలకు సీఎం కేసీఆర్ అధిక నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. జాతర ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని అధికారులకు సూచించారు. జాతరకు వచ్చే భక్తులను శానిటైజ్ చేసిన అనంతరం క్యూలైన్లలోకి అనుమతించాలని.. అలాగే మాస్కులు తప్పని సరిగా ధరించేలా చూడాలని వివిధ సేవా సంఘాల ప్రతినిధులు అధికారులకు విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ వెంకట్, ఆదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆలయ ఈవో గుత్తా మనోహర్రెడ్డి, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, ఏసీపీ రమేశ్, ట్రాఫిక్ ఏసీపీ వినోద్కుమార్, జలమండలి డైరెక్టర్ కృష్ణ, జీఎం రమణారెడ్డి పాలక మండలి సభ్యులు, కార్పొరేటర్లు మహేశ్వరి, చీర సుచిత్ర, కొంతం దీపిక పాల్గొన్నారు. అనంతరం మంత్రి సమక్షంలో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం చేసింది.