సిటీబ్యూరో, మార్చి 15 (నమస్తే తెలంగాణ): కొత్త విద్యుత్ కనెక్షన్ కావాలన్నా.. పేరు మార్పు చేసుకోవాలన్నా.. లోడ్ చేంజ్ చేసుకోవాలన్నా.. ఇలా సేవలేవైనా ఇంట్లోంచి కాలు కదపకుండానే ఆన్లైన్లో విద్యుత్ సేవలు పొందేలా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ శ్రీకారం చుట్టింది. విద్యుత్ వినియోగదారులకు సులభతరంగా సేవలందేలా.. వేగవంతంగా పనులు పూర్తిచేసుకునేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నది. ఇప్పటివరకు విద్యుత్ సంబంధిత సేవలకు దరఖాస్తు చేసుకునేందుకు ఆయా సెక్షన్ల పరిధిలోని వినియోగదారుల సేవా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. పనులు కాకపోవడంతో మళ్లీ మళ్లీ వెళ్లాల్సిన పరిస్థితి. దీనికి పరిష్కారంగా దక్షిణ తెలంగాణ విద్యుత్పంపిణీ సంస్థ ఆన్లైన్లోనే సులభతరంగా సేవలు పొందేలా ప్రత్యేకంగా అప్లికేషన్ను రూపొందించి వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
ఆన్లైన్ సేవల కోసం..
గ్రేటర్ హైదరాబాద్ పరిధికి సంబంధించిన విద్యుత్ సేవలను పొందేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్పంపిణీ సంస్థకు చెందిన www.tssouthernpower. comలో అందుబాటులో ఉంది. ఇందు లో రకరకాల సమాచారం (పే యువర్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్లింగ్, ఆన్లైన్ న్యూకనెక్షన్ అండ్ కంప్లెయింట్ రిజిస్ట్రేషన్ పేరు)తో ప్రత్యేక లింకులను ఏర్పాటు చేశారు. ఇందులో ఆన్లైన్ న్యూకనెక్షన్ లింక్పై క్లిక్ చేయగానే కస్టమర్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ) పేరుతో ప్రత్యేకంగా ఓ పేజీ వస్తుంది. ఇందులో న్యూ సర్వీస్ కనెక్షన్, అపార్టుమెంట్ కనెక్షన్, లేఅవుట్, కంప్లెయింట్ రిజిస్ట్రేషన్, అడిషనల్ లోడ్ వంటి సేవలను ఆన్లైన్లో పొందేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. అవసరమైన సర్వీసులను ఎంపిక చేసుకుని దరఖాస్తు చేసుకునేందుకు మొబైల్ నంబర్, ఈ మెయిల్ జతపరిస్తే 4 అంకెల ఓటీపీ (వన్టైం పాస్వర్డ్) వస్తుంది. దాని ఎంటర్ చేస్తే దరఖాస్తు ఫారం డిజిటల్ ఫార్మాట్లో వస్తుంది. ఆ దరఖాస్తు ఫారాన్ని పూరించి వెబ్సైట్లో తెలిసిన మార్గాల్లో వివిధ రకాల్లో ఫీజును చెల్లించుకుంటే సరిపోతుంది.
మొబైల్ యాప్ ద్వారా సేవలు..
దక్షిణ తెలంగాణ విద్యుత్పంపిణీ సంస్థకు చెందిన మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్లో టీఎస్ఎస్పీడీసీఎల్ పేరుతో ఉంది. ఇప్పటికే వాడుకలో ఉన్న సంస్థకు చెందిన మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్ సేవలను పొందవచ్చని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. మున్ముందు వినియోగదారులకు అవసరమైన మరిన్ని సేవలను ఆన్లైన్లోకి తీసుకువస్తామని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా, వేగంగా పొందేలా ఆన్లైన్లో సేవలను అందించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని తెలిపారు.