వర్షాకాలంలో అప్రకటిత కోతలు లేకుండా చూడాలి
గ్రేటర్లో విద్యుత్ సరఫరాపై అధికారుల సమీక్షా సమావేశం
సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని ట్రాన్స్కో అండ్ జెన్కో సంస్థల చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డి.ప్రభాకర్రావు ఆదేశించారు. మంగళవారం సాయంత్రం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ జి.రఘుమారెడ్డితో కలిసి విద్యుత్ సరఫరాపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుత వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, ఇందుకోసం క్షేత్రస్థాయిలోని అధికారులు పటిష్టమైన ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు. గ్రేటర్ పరిధిలోని 9 సర్కిళ్లలోని సూపరింటెండెంట్ ఇంజినీర్స్, డివిజినల్ ఇంజినీర్స్, అసిస్టెంట్ డివిజినల్ ఇంజినీర్లు సబ్ స్టేషన్లను తనిఖీ చేయాలని, అదేవిధంగా లైన్లను, ట్రాన్స్ఫార్మర్లను తరచూ పరిశీలించడం ద్వారా అంతరాయం కలగకుండా చూడాలన్నారు. విద్యుత్కు సంబంధించిన ఫిర్యాదులు నమోదు కోసం 1912 కంట్రోల్ రూమ్ను బలోపేతం చేయాలని సూచించారు. విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవడంతో పాటు విద్యుత్ చౌర్యం కాకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా చేయాలని సూచించిందని, దాని అనుగుణంగా క్షేత్రస్థాయిలోని అధికారులు సరఫరా కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.