సిటీబ్యూరో, మే 18(నమస్తే తెలంగాణ): కరోనా కట్టడికి లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని విద్యుత్ బిల్లుల వసూలు సమయాలను మార్చుతున్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ నెలకు సంబంధించి గ్రేటర్ పరిధిలో విద్యుత్ మీటర్ల రీడింగ్ తీసే పని పూర్తి కావడంతో అధికారులు బిల్లుల వసూలుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలో 71, జీహెచ్ఎంసీ పరిధిలో 31 ఈఆర్ఓ కేంద్రాలు ఉన్నాయి. కాగా, గ్రేటర్లో విద్యుత్ శాఖకు సంబంధించి తొమ్మిది సర్కిళ్లు ఉండగా, వాటి పరిధిలో 190 కలెక్షన్ సెంటర్లు ఉన్నాయి. సర్కిళ్ల ఎస్ఈలు, సీనియర్ అకౌంట్ ఆఫీసర్లు తమ సర్కిళ్ల పరిధిలో బిల్లులు సకాలంలో వసూలు చేసేందుకు క్షేత్ర స్థాయిలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని చీఫ్ జనరల్ మేనేజర్ (రెవెన్యూ) ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ శాఖ కార్యాలయాల్లో ఉన్న ఈఆర్ఓ కేంద్రాలతో పాటు కలెక్షన్ సెంటర్లలో ఉదయం 6నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బిల్లులు చెల్లించే అవకాశం ఉందని తెలిపారు. లాక్డౌన్ కారణంగా విద్యుత్ బిల్లులు వసూలులో ఎలాంటి జాప్యం కలగకుండా వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించేలా అధికారులు తమ సర్కిళ్ల పరిధిలో చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రధానంగా లాక్డౌన్ నిబంధనలు అమలవుతున్న నేపథ్యంలో విద్యుత్ బిల్లులు వసూలు చేసే ప్రైవేట్ ఏజెన్సీ వ్యక్తులకు గుర్తింపు కార్డులు జారీ చేసి బిల్లుల వసూలు చేపట్టాలని సూచించారు.