మారేడ్పల్లి, సెప్టెంబర్ 18: గణనాథుడి నిమజ్జనాన్ని పురస్కరించుకొని ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు సికింద్రాబాద్ డీవీఎం జి. జగన్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. నిమజ్జనం సందర్భంగా సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని చెంగిచర్ల, కుషాయిగూడ, హకీంపేట, రాణిగంజ్ డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 19న ఉదయం నుంచి రాత్రి వరకు బస్సులు నడుపనున్నట్లు తెలిపారు. ద్విచక్రవాహనాలు, కార్లలో వెళ్లడడం వల్లన ట్రాఫిక్ సమస్య తలెత్తుందని, ప్రజలందరూ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. చెంగిచర్ల నుంచి ఉప్పల్, రామంతపూర్, విద్యానగర్, ఆర్టీసీ ఎక్స్ రోడ్డు మీదుగా ఇందిరా పార్కు వరకు, ఈసీఐఎల్ బస్టాండ్ నుంచి నేరేడ్మెట్, మల్కాజ్గిరి, మెట్టుగూడ, చిలకలగూడ చౌరస్తా, ముషిరాబాద్ ఎక్స్రోడ్డు మీదుగా ఇందిరా పార్కు వరకు, హకీంపేట నుంచి కౌకూర్ చౌరస్తా, రిసాలబజార్, అల్వాల్, కార్ఖాన, జేబీఎస్ బస్టాండ్, సికింద్రాబాద్, కవాడిగూడ, ఇందిర పార్కు వరకు, సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాణిగంజ్ వరకు ప్రత్యేక బస్సులు ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు నడపనున్నట్లు వెల్లడించారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.