మైలార్దేవ్పల్లి, ఏప్రిల్ 9 : ప్రైవేటు ట్రాన్స్పోటుకు దీటుగా వినియోగదారులకు చేరువగా ఉండేలా కార్గో పార్సిల్ సేవలను ఆర్టీసీ విస్తరింపచేస్తున్నది. ప్రజలకు మరింత మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు కంకణం కట్టుకుని ముందుకెళ్తున్నది. తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలో ఎక్కడికైన 12గంటల్లో ఎలాంటి వస్తువునైన చేరవేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ నష్టాల్లో ఉండడంతో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. లాక్డౌన్లో ఏర్పాటు చేసిన కొరియర్ పార్సిల్ అండ్ కార్గో సర్వీస్ను ప్రారంభించి అనుకున్న సమయంలో వస్తువులు డెలివరి చేస్తున్నది. మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని పర్సిల్ సర్వీస్ కేంద్రాన్ని దుర్గానగర్, మైలార్దేవ్పల్లి చౌరస్తాలో ఏర్పాటు చేశారు. మొదట ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ రానురాను పుంజుకున్నదని నిర్వాహకుడు ప్రకాష్ పేర్కొన్నారు. ఈ సర్వీస్ వల్ల తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నుంచి పార్సిల్లు తొందరగా చేరుకుంటున్నాయన్నారు. ఈ సర్వీసులను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రంలోని కొన్ని ప్రధాన నగరాల నుంచి కూడా వస్తువులు 24గంటల్లో ఇక్కడకు చేరుతున్నాయని తెలిపారు. గతంలో ప్రైవేటు ట్రాన్స్పోర్టులో ఏదైన వస్తువును ఇతర ప్రదేశానికి చేరవేయాలంటే నాలుగు నుంచి అయిదు రోజులు పట్టేది. ఎందుకంటే ప్రైవేట్ ట్రాన్స్పోర్టులలో లోడ్కు కావలసిన వస్తువులు వచ్చినప్పుడే ట్రాన్స్పోర్టు చేసేవారు. దీంతో వచ్చే పార్సిల్ కోసం ప్రజలు ఎదురు చూస్తుండే వారు. కాని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ వారు ఏర్పాటు చేసిన కార్గో సర్విస్ ద్వారా ఎదరు చూపు లేకుండా ప్రజలకు వస్తువులను చేరవేస్తున్నారు. ఆర్టీసీలో పార్సిల్లు సురక్షితంగా ఇంటికి చేరడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.