సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ) : నిరుపయోగంగా ఉన్న వజ్ర బస్సులను అంబులెన్సులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు. ఈ విషయమై వైద్యాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. వాటికి ఫిట్నెస్ టెస్ట్ చేయించి.. అనువుగా ఉన్న వాహనాలనే అంబులెన్సులుగా ఉపయోగించాలన్న ఆలోచన ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు వంద వరకు ‘వజ్ర’లు ఉన్నాయి. కరోనా నేపథ్యంలో వీటి వాడకాన్ని తగ్గించారు. కొన్ని బస్సులకు ఫిట్నెస్ తగ్గిందని అధికారులు భావిస్తున్నారు. 63 బస్సుల వరకు రెండు లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగాయని, వాటికి ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందంటున్నారు. ఫిట్నెస్ ఓకే అయితే అంబులెన్సులుగా మార్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కాగా, ఇప్పటికే ఖమ్మం జిల్లాలో మూడు బస్సులను మొబైల్ టెస్టింగ్ ల్యాబ్లుగా తీర్చిదిద్దారు. మిగిలిన బస్సులను సైతం ఉపయోగంలోకి తెచ్చే ఆలోచనలో ఉన్నారు.