సిటీబ్యూరో, సెప్టెంబర్ 25(నమస్తే తెలంగాణ): సిటీ బస్సుల రాకపోకల గురించి ప్రయాణికులకు తెలియజేయడంతో పాటు, వారి నుంచి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు స్వీకరించడంపై ఆర్టీసీ దృష్టి సారించింది. అందుకోసం తెలంగాణ ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రయాణికులకు మెరుగైన సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా కొత్త వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేశారు. వాటిని కోఠి బస్స్టేషన్లో ఒక్క గ్రూపు, సికింద్రాబాద్లోని రైతిఫైల్ బస్టాపులో రెండో వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేశారు. ఈ రెండు నంబర్లతో కొత్తగా వాట్సాప్ ఉన్న రెండు ఫోన్ నంబర్లు ప్రకటించారు. ఇందులో కోఠి పరిధిలో వాట్సాప్ గ్రూపు 99592 26160, సికింద్రాబాద్ పరిధిలో వాట్సాప్ నంబరు 83339 05431తో గ్రూపు ఏర్పాటు చేశారు. స్మార్టు ఫోన్లు ఉన్న ప్రతి ప్రయాణికుడు ఆర్టీసీ ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపులో బస్సుల గురించి తమ అభిప్రాయాలను పంచుకునే విధంగా వాట్సాప్ను అందుబాటులోకి తెచ్చామని ఆర్టీసీ జీహెచ్ఎంసీ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి వెంకటేశ్వర్లు తెలిపారు. అయితే వాట్సాప్ ద్వారా వినూత్న విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన వారం రోజులలో ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. ప్రతి రోజు కనీసం 20 నుంచి 30 వరకు వాట్సాప్ పోస్టింగ్లు వస్తున్నాయని, వాటిని పై అధికారులకు పంపించి, సమస్యలను వెంటనే పరిష్కరించడానికి కృషి చేస్తున్నట్లు అధికారులు తెలియచేస్తున్నారు.