సిటీబ్యూరో, జూన్ 11(నమస్తే తెలంగాణ): తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల పొడిగించిన లాక్డౌన్ సడలింపు నేపథ్యంలో ఆర్టీసీకి స్వల్ప ఊరట కలిగింది. గురువారం నుంచి ఆర్టీసీ జీహెచ్ఎంసీ పరిధిలో సిటీ బస్సులు సందడి చేస్తున్నాయి. ప్రయాణికులు పలు కార్యకలాపాలకు సిటీ బస్సులను వినియోగిస్తున్నారు. సిటీ బస్టాపులు ప్రయాణికులతో సందడిగా కనిపిస్తున్నాయి. ఆఫీసులకు వెళ్లే వారు, రోజు వారి పనులకు వెళ్లే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇన్ని రోజులు ఎక్కువ భాగం ఇండ్లలోనే గడిపిన కండక్టర్లు, డ్రైవర్లు కూడా విధులకు హాజరవుతున్నారు. ఆక్యుపెన్సీ పెంచడంపైనే దృష్టి సారిస్తున్నారు.
కొనసాగింపుగా ఆర్టీసీ జీహెచ్ఎంసీ జోన్ పరిధిలో బుధవారం నుంచి 1,500 పైగా సిటీ బస్సులను నడుపుతున్నట్లు జీహెచ్ఎంసీ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. లాక్డౌన్ సడలింపును ఉదయం 6 నుంచి సాయంత్రం 5గంటల వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో.. సిటీ బస్సులను కూడా సడలింపు సమయంలో తిప్పుతున్నామన్నారు. ఈ మేరకు రోజుకు దాదాపు ఎనిమిది నుంచి పది ట్రిప్పుల వరకు బస్సులను నగర రోడ్లపై తిప్పే అవకాశం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
లాక్డౌన్ సడలింపును పొడిగించిన నేపథ్యంలో 1,500 పైగా సిటీ బస్సులు నడుస్తున్నాయి. దీంతో బుధవారం ఒక్క రోజే దాదాపు రూ.1.20 కోట్ల వరకు రాబడి రాగా.. గురువారం రూ.కోటి పైగా రాబడి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
నగరంలో ఉదయం 6.30 గంటల నుంచే సిటీ బస్సులలో రోజూ ప్రయాణం చేయాలనుకున్న వారు పాసులు తీసుకోవడానికి అధికారులు పాసులు జారీ చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకు ప్రయాణికులు పాసుల కోసం ఆన్లైన్ దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ నెల 15 నుంచి దాదాపు 37 సర్కిళ్లలో బస్పాసులు జారీ చేయడానికి జీహెచ్ఎంసీ జోన్ ఆరీస్టీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.