సిటీబ్యూరో/మేడ్చల్, మే 29(నమస్తే తెలంగాణ): ఆర్టీసీలో పని చేస్తున్న కార్మికులు, కండక్టర్లు, డ్రైవర్లకు కూడా వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆర్టీసీ జీహెచ్ఎంసీ జోన్ ఆధ్వర్యంలో మొత్తం 16 వేల మంది కార్మికులు ఉండగా, వారిలో ఇప్పటికే 45 ఏండ్లలోపు ఉన్న 8,100 మందికి తొలి విడుత వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 18 నుంచి 45 ఏండ్ల లోపు వయసున్న ఉన్న వారికి వ్యాక్సిన్ వేయనున్నారు.
ఈ మేరకు మొత్తం 7,900 మందికి వ్యాక్సిన్ వేసేందుకు జీహెచ్ఎంసీ జోన్ పరిధిలో మొత్తం పద్నాలుగు కేంద్రాలను గుర్తించామని జీహెచ్ఎంసీ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. వాటిలో తార్నాక ఆర్టీసీ ఆస్పత్రి, ఉప్పల్ డిపో, హయత్నగర్ డిపో, కుషాయిగూడ డిపో, కూకట్పల్లి డిపో, మియాపూర్-2 డిపో, ఇబ్రహీంపట్నం డిపో, రాజేందర్నగర్ డిపో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డిపో, ఎంజీబీఎస్, జేబీఎస్, రెతిఫైల్, ఆర్టీసీ భవన్లో ఏర్పాటు చేశామని తెలిపారు.
మేడ్చల్ జిల్లాలోని ఉప్పల్ ఆర్టీసీ డిపోలో వ్యాక్సినేషన్ ఏర్పాట్లను శనివారం కలెక్టర్ శ్వేతామహంతి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్టీసీకి చెందిన డిపో మేనేజర్లు, కంట్రోలర్లు, డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీలో పనిచేసే మెకానిక్లు, ఇతర సిబ్బందికి ఆదివారం నుంచి కరోనా టీకాలు వేయనున్నట్లు ఆమె తెలిపారు. టీకాలు వేసేందుకు మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలో ఐదు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ వేసే సమయంలో ఇబ్బందులు ఎదురవకుండా వైద్యశాఖ చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావు ఉన్నారు.