సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ) : నాలుగు గంటల సేపు ప్రయాణంలోనూ నగర ఆర్టీసీకి స్వల్పంగా ఆదాయం పెరిగింది. ప్రస్తుతం ఉదయం 6 నుంచి 10 వరకు సిటీలో ఒక్క ట్రిపు మాత్రమే బస్సులను నడుపుతున్నారు. దీని వల్ల రోజుకు రూ. 25 లక్షల వరకు ఆదాయం వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. లాక్డౌన్ విధించిన మొదటి పది రోజులలో కేవలం రూ.10 నుంచి 15 లక్షల మాత్రమే రాబడి వచ్చిందని, ఇప్పుడది రెట్టింపు అయింది. లాక్డౌన్ సమయాల్లో మార్పులు చేస్తే కనీసం రెండు ట్రిప్పులు బస్సులు తిప్పడానికి అవకాశం ఉంటుందని, దాని వల్ల ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. సాధారణ సమయంలో ఆర్టీసీ జీహెచ్ఎంసీ జోన్ పరిధిలో దాదాపు రూ.2.50 కోట్ల వరకు ఆదాయం లభిస్తుంది. కాగా జీహెచ్ఎంసీ పరిధిలోని 29 డిపోల పరిధిలో 2,700 వరకు ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించిన మొదటి రోజు నుంచి దాదాపు 700 నుంచి 800 బస్సులు మాత్రమే సిటీలో తిప్పుతున్నారు.