ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 11: రాష్ట్రంలోని అన్ని ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, ఫార్మసీ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్పీజీఈసెట్-2021 ప్రవేశ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరఫున ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తున్నది. ఉదయం సెషన్కు సంబంధించిన పరీక్షకు పాస్వర్డ్ను ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ ఎంటర్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం టీఎస్పీజీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పి. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ పరీక్షలను 14వ తేదీ వరకు రోజూ రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంట ల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. 19 పీజీ కోర్సుల్లో ప్రవేశానికి 23,187 విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారికి రాష్ట్ర వ్యాప్తంగా 14 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉద యం పరీక్షకు 89.63, మధ్యాహ్నం పరీక్షకు 79.08శాతంగా హాజరు నమోదైందని చెప్పారు.